ఖమ్మం లీగల్, జూలై 10: భారతీయులు స్వతహాగా సౌమ్యులని, వారి జీవన సరళిలోనే రాజీ ధోరణి ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవా సంస్థల ఛైర్మన్ సీ.హరేకృష్ణ భూపతి అన్నారు. స్థానిక న్యాయసేవా సదన్లో జాతీయ లోక్ అదాలత్ను శనివారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి నుంచి లోక్ అదాలత్ పరిష్కార ప్రక్రియ చురుగ్గానే ఉందని, అన్ని వర్గాల సహకారమే అందుకు కారణమని అన్నారు. సున్నితమైన కుటుంబ బంధాలను కాపాడటానికి లోక్ అదాలత్లు వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే నాలుగైదు రకాల కేసులు దాఖలవుతుంటాయని, ఒక కేసులో రాజీ పడితే మిగతా కేసులు కూడా సమసిపోతాయని అన్నారు. న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఎంఏ అబ్దుల్ పాషా తొలుత ఈ అదాలత్ను ప్రారంభిస్తూ దీని ప్రాముఖ్యాన్ని వివరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ న్యాయవాదుల సంపూర్ణ మద్దతుతో జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని అన్నారు. కాగా.. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇండియన్ బ్యాంకు సౌజన్యంతో కక్షిదారులకు పులిహోర, పెరుగన్నం, మంచినీరు ఏర్పాటు చేశారు.
పారా లీగల్ వలంటీర్లకు సన్మానం
జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఈ సారి వినూత్నంగా గృహహింస, భరణం కేసుల్లో కక్షిదారులకు పారాలీగల్ వలంటీర్ల ద్వారా నోటీసులు అందించి రాజీ దిశగా వారిని కార్యోన్ముఖులను చేశారు. దీని నిమిత్తం కార్యదర్శి జావీద్ పాషా పారాలీగల్ వలంటీర్లతో సమావేశం నిర్వహించి వారికి విధివిధానాలను వివరించారు. ఇది సత్ఫలితాన్నిచ్చింది. నాలుగు కేసులు రాజీమార్గంలో పరిష్కారమయ్యాయి. సమర్థవంతంగా పనిచేసిన వలంటీర్లను ఈ సందర్భంగా సన్మానించారు. న్యాయమూర్తులు వీ.బాలభాస్కర్రావు, ఆర్.తిరుపతి, మహ్మద్ అఫ్రోజ్ అక్తర్, ఎన్.అనితారెడ్డి, ఎం.ఉషశ్రీ, రుబినా ఫాతిమా, శాంతిసోని, పి.మౌనిక, హైమ పూజిత పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో 3,064 కేసుల పరిష్కారం
ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్కే భూపతి ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 3,064 కేసులు పరిష్కారమయ్యాయి. ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి వీ.బాలభాస్కర్రావు మోటారు వాహన ప్రమాద కేసుల బెంచ్కి అధ్యక్షత వహించి 74 మోటారు ప్రమాద కేసులను పరిష్కరించారు. బాధితులకు మొత్తం రూ.3.46 కోట్ల పరిహారం ఇవ్వడానికి బీమా కంపెనీ అధికారులు అంగీకరించారు. సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ బ్యాంకు, ఇతర సివిల్ కేసులను పరిష్కరించారు. న్యాయమూర్తులు ఎన్.అనితారెడ్డి, ఎం.ఉషశ్రీ, రుబినా ఫాతిమా, ఎన్.శాంతిసోని, పీ.మౌనిక, హైమ పూజిత లోక్ అదాలత్ బెంచ్లకు అధ్యక్షత వహించి కేసులను పరిష్కరించారు. న్యాయసేవా సంస్థ న్యాయమూర్తి జావీద్ పాషా పర్యవేక్షించారు. న్యాయవాదులు ఎం.నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ, సంపత్, చంద్రశేఖర్, రవిప్రసాద్, పీ.పద్మావతి, కే.గురుమూర్తి, కృష్ణారావులు లోక్ అదాలత్ సభ్యులుగా వ్యవహరించారు. పోలీసు లైజన్ అధికారి పీ.భాస్కర్రావు, జిల్లా కోర్టు పరిపాలనాధికారి ఏ.వెంకటేశ్వర్లు, నాజర్ మున్వర్ సహకరించారు. కొత్తగూడెంలో 463, సత్తుపల్లిలో 813, మధిరలో 227, ఇల్లెందులో 300, మణుగూరులో 128, భద్రచలంలో 316, ఖమ్మంలో 817 కేసులు పరిష్కారమయ్యాయి.