ఖమ్మం, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర శాసనసభలో టీడీపీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. వీరిద్దరూ టీడీపీని వీడడంతో జిల్లాలో ఆ ఆపార్టీ నామరూపాల్లేకుండా పోయిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. టీడీపీ శాసన సభ్యులు తీసుకున్న నిర్ణయంతో ఆయా నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్, టీడీపీ శ్రేణుల్లో హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సత్తుపల్లి శాసన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట శాసన సభ్యుడు మెచ్చా నాగేశ్వరరావులు బుధవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కలిసి టీడీపీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్లో వీలినం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు విలీనం లేఖను అందించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ శాసన సభ్యుల బలం ఎనిమిదికి చేరింది. కాంగ్రెస్ తరఫున భద్రాచలం, మధిర నియోజకవర్గాల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న శాసన సభ్యులు మాత్రమే మిగిలారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు రాజకీయంగా చక్రం తిప్పిన టీడీపీ.. ఇప్పుడు పూర్తిగా కనుమరుగైంది. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో అశ్వారావుపేట నుంచి టీడీపీ తరఫున మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లి నుంచి టీడీపీ తరఫున సండ్ర వెంకటవీరయ్య విజయం సాధించారు. అయితే సండ్ర వెంకటవీరయ్య సాధారణ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి జిల్లాలో టీఆర్ఎస్ కార్యకలాపాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
అయితే సాంకేతికంగా మాత్రం టీడీపీ శాసన సభ్యుడిగానే కొనసాగుతున్నారు. ఇక అశ్వారావుపేట టీడీపీ శాసనసభ్యుడు మెచ్చా నాగేశ్వరరావు మాత్రం ఇప్పటి వరకు అదే పార్టీలో కొనసాగారు. ఆయన టీఆర్ఎస్లో చేరనున్నారని కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు మెచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్యలు టీడీపీని వీడడంతో రాష్ట్రంలో అసలే మిణుకు మిణుకు మంటున్న టీడీపీ పూర్తిగా ప్రాభవం కోల్పోయినట్లయింది. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న మెచ్చా నాగేశ్వరరావు 2014లో సైతం అశ్వారావుపేట నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున విజయం సాధించారు.
ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు అభివృద్ధి పరంగా నియోజకవర్గాలను మరింత పురోగమింపచేసేందుకు ఇద్దరు శాసనసభ్యులూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక సీనియర్ శాసనసభ్యుడైన సండ్ర వెంకటవీరయ్య అధికారకంగా టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో సత్తుపల్లి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ మరింత బలపడేందుకు అవకాశం ఏర్పడింది. 1994లో పాలేరు నియోజకవర్గం నుంచి సీపీఎం శాసన సభ్యుడిగా గెలుపొందిన సండ్ర వెంకటవీరయ్య ఆ తర్వాత కొద్ది కాలానికి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో ఆయన 2009లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున గెలిచి హ్యాట్రిక్ సాధించారు. టీడీపీ శాసనసభా పక్షం టీఆర్ఎస్ఎల్పీలోవిలీనం కావడంతో ఉమ్మడి జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా మిగిలిన నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
ఎనిమిదికి చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య
ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వర్రావు టీఆర్ఎస్లో చేరడంతో ఉమ్మడి జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పరుగులు పెట్టనున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్లోకి..
నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరాను. నా వెన్నంటి ఉండి తనను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేయలేకపోతున్నానని, అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేయడం జరిగిందని, నియోజకవర్గాన్ని అడుగడుగునా అభివృద్ధిబాటలో నడిపించడం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజకీయ గురువు తుమ్మల సలహాలు, సూచనలు మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధిబాటలో నడిపేందుకు తనవంతు కృషిచేస్తానని, పథకాలను అర్హులందరికీ చేరేలా తాను బాధ్యతగా వ్యవహరిస్తాను.
-ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు