గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు
వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ
అధికారులతో రెండు జిల్లాల కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, ఎంవీ రెడ్డి సమీక్షలు
ఖమ్మం, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇస్తూ గ్రామాల్లోనే కొనుగోలు చేయాలని నిర్ణయించింది.. గ్రేడ్ ధాన్యానికి రూ.1,860, సాధారణ గ్రేడ్ ధాన్యానికి రూ.1,840కు మద్దతు ధర ప్రకటించింది.. గతేడాది కంటే ఈసారి వరి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో అందుకు అనుగుణంగా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నిర్దేశిత లక్ష్యాలను అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పకడ్బందీగా కొనుగోళ్లు చేపట్టేలా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, ఎంవీ రెడ్డి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు..
రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అందుకు అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. రైతులు నష్టపోకుండా పండించిన ప్రతి ధాన్యం గింజనూ కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈసారి ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఖమ్మం కలెక్టర్ కర్ణన్ అధికారులతో సమావేశమై ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. ఏప్రిల్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరి కోతలు కొన్నిచోట్ల ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రైతులు ఇబ్బందులు పడకుండా తొలిదశలో వరి కోతలు ప్రారంభమైన చోట తక్షణం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిరుటితో పోల్చితే ఖమ్మం జిల్లాలో ఈసారి అత్యధికంగా యాసంగిలో వరి సాగు జరిగింది. దీంతో అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
5.50 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. గతంలో మాదిరిగానే ఈసారి సైతం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐకేపీ సభ్యుల ద్వారా 69 కేంద్రాలు, పీఏసీఎస్ల ద్వారా 315 కేంద్రాలు, ఏఎంసీల ద్వారా 9 కేంద్రాలు, డీసీఎంఎస్ల ద్వారా 45 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ద్వారా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ యాసంగిలో 438 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు సేకరించాలని నిర్ణయించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1860, సాధారణ గ్రేడ్ ధాన్యానికి రూ.1840 కనీస మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. ధాన్యం విక్రయించిన రైతుకు మూడు రోజుల నుంచి వారం రోజుల్లోపు నగదును జమచేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేయింగ్ మిషన్లు, టార్పాలిన్లు సిద్ధం చేశారు. ఇప్పటికే 33 లక్షల గన్నీబ్యాగులు సిద్ధంగా ఉన్నాయి. మరో 40 లక్షల గన్నీసంచులు అవసరం కాగా వాటిని తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత యాసంగిలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా ఈసారి సాగర్ ఆయకట్టులో వరిసాగు విస్తృతం కావడం, దిగుబడి సైతం పెరిగే అవకాశం ఉండడంతో 4.50 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అన్నిప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు..
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేశాం. వరి కోతలు ప్రారంభ దశలో ఉండటంతో ఏప్రిల్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. 438 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. రైతు విక్రయించిన ధాన్యానికి సకాలంలో నగదును వారి ఖాతాలో జమ అయ్యేలా నిరంతరం పర్యవేక్షిస్తాం. గన్నీ బ్యాగులు, వేయింగ్ మిషన్లు సిద్ధంగా ఉన్నాయి.
-మధుసూదన్, అదనపు కలెక్టర్, ఖమ్మం
ఇవి కూడా చుడండి
ఏప్రిల్ 3 వరకు యాదాద్రిలో ఆర్జిత సేవలు రద్దు
జానారెడ్డి ఇక గతం మాత్రమే : మంత్రి జగదీశ్ రెడ్డి
సాగర్ ఉపఎన్నిక : ముగిసిన నామినేషన్ల పర్వం