మారుమూల పల్లెల్లో కరోనాపై పెరిగిన అవగాహన
వైద్యసిబ్బంది సూచనలు పాటిస్తూ కొవిడ్ కట్టడి
ఫస్ట్, సెకండ్ వేవ్ల్లో పాజిటివ్ కేసులు నిల్
ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలపై ప్రత్యేక కథనం
సుజాతనగర్/ చర్ల, మే 22: ఒకవైపు సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తున్నది.. ప్రజలను గడగడలాడిస్తున్నది.. జనం భయంతో వ ణికిపోతున్నారు.. ఇప్పటికే ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించా యి.. పటిష్టంగా అమలు చేస్తున్నాయి.. కూలీ నాలి చేసుకునే వా రి నుంచి వ్యాపారుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు.. అయినప్పటికీ ఇక్కడో అక్కడో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.. కానీ..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని గూడేల్లో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. గిరిజనుల చైతన్యానికి ప్రభుత్వ సహకారం, వైద్యసిబ్బంది తోడు కావడంతో మహమ్మారి సులభంగా కట్టడి అవుతున్నది. జిల్లాలోని ఛత్తీస్గఢ్ సరిహద్దు చర్ల మండలంలోని యర్రంపాడు, బట్టిగూడెం, కిష్టారంపాడు, అర్సీ పురం, తిమ్మిరిగూడెం తదితర గిరిజన గూడేల్లో ఫస్ట్, సెకండ్ వేవ్ల్లో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ తేలలేదు. ఒక్కో గూడెంలో నివసించే 30-40 కుటుంబాలు చైతన్యంతో తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాయి.
వైద్యారోగ్యశాఖ క్యాంపులు..
ఆదివాసీ బిడ్డలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. ఇటీవల ప్రత్యేక బృందాలను ఇంటింటికీ పంపించి జ్వర సర్వే నిర్వహించిన సంగతి విదితమే. ఈసర్వేలో ఒక్కరికి కూడా జ్వరం ఉన్నట్లు తేలలేదు. ఆయా గిరిజన గూడేల్లో వైద్య సిబ్బంది ఇప్పటికే అనేకసార్లు వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశ కార్యకర్తలు, వైద్యసిబ్బంది గ్రామం లో పర్యటిస్తూ కరోనా నివారణపై అవగాహన కల్పించారు. దీంతో గిరిజనులంతా చైతన్యవంతులయ్యారు. ఇతరులు ఎవరి నీ గ్రామస్తులు గ్రామంలోకి రానీయడం లేదు. అందరి ఆరోగ్యం కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని, గ్రామపెద్దలు చేసిన తీర్మానానికి కట్టుబడి ఉంటున్నామని గూడెంవాసులు వెల్లడిస్తున్నారు. గతంలో సీజనల్ వ్యాధులు ప్రబలేవని ఈసారి పాలకవర్గాలు పకడ్బందీగా పారిశుధ్య చర్యలు చేపడుతుండడంతో వ్యాధుల బెడద లేదంటున్నారు. అవసరమైతే తప్ప ఇతరుల ఇంటికి వెళ్లడం లేదంటున్నారు.
ఆదర్శం నాన్యాతండా..
సుజాతనగర్ మండలంలోని బేతంపూడి పంచాయతీ పరిధిలో ఉంటుంది నాన్యాతండా. ఇక్కడ 55 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. జనాభా 280. ఇక్కడ నివసించే వారంతా గిరిజనులే. అందరూ వ్యవసాయం ఆధారపడి జీవించే వారే. మారుమూల గూడెం అయిన ఈ తండాలో ఫస్ట్, సెకండ్ వేవ్లో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు, వైద్యారోగ్యశాఖ అధికారులు సూచనలు పాటిస్తూ వీరంతా కరోనాను కట్టడి చేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు. కొత్త వ్యక్తులను తండాలోకి అనుమతించడం లేదు. తమకు దొరికి జొన్నలు, రాగులతో జావ చేసుకుని తింటూ రోగనిరోధక శక్తిని పెంచుకుంటున్నామని, పూర్వీకుల నాటి ఆహారమే తీసుకుంటున్నామని తండా పెద్దలు చెప్పారు. పాలకవర్గమూ ప్రతిరోజూ పారిశుధ్య చర్యలు చేపడుతుండడంతో వ్యాధులు దూరమయ్యాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన జ్వర సర్వేలోనూ ప్రత్యేక బృందాలు తండావాసులంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలపడం విశేషం.