లాక్డౌన్ నిబంధనలు కఠినతరం
చెక్పోస్టులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
నిబంధనల ఉల్లం‘ఘనుల’పై చర్యలు
ప్రజలు స్వీయనింత్రణ పాటించాలంటున్న పోలీస్ అధికారులు
కంటిమీద కునుకు లేకుండా విధులు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పోలీసుల తెగువపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. 24/7 విధులు నిర్వర్తిస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంలా నిలుస్తున్నారు. వైరస్ చైన్ లింకును బ్రేక్ చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వైద్యుల తర్వాత అత్యంత కీలకమైన బాధ్యతలు తీసుకున్న పోలీసులు ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పిస్తున్నారు. “మీరు ఇంట్లో ఉండండి.. మేము మీ కోసం బయట ఉంటాం”.. అనే నినాదంతో పని చేస్తున్నారు. సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్నా.. ప్రజాశ్రేయస్సే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. డీజీపీ మహేందర్రెడ్డి దిశానిర్దేశంతో పోలీస్ అధికారులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కరోనా నియంత్రణకు కంచె (చెక్పోస్టులు) ఏర్పాటు చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తున్నారు. కొవిడ్ కట్టడికి నిరంతరం శ్రమిస్తున్న పోలీసులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం. -ఖమ్మం మే 21
మంత్రి కేటీఆర్ ట్వీట్తో పోలీసుల్లో ఉత్సాహం
కొవిడ్ సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విధ్వంసంలో పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారు. అత్యంత విలువైన ఔషధాలు, ఆక్సీజన్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. బ్లాక్దందా చేసివారిపై కేసులు నమోదుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా మంత్రి కేటీఆర్ ట్వీట్తో తమలో మరింత ఆత్మవిశ్వాసం.. ఉత్సాహం పెరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు.
కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులతోపాటు పోలీసులూ అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు ప్రభుత్వ ఆదేశాలతో రాత్రి 9 గంటల తరువాత నైట్ కర్ఫ్యూ విధించారు. ఈ నెల 12న ఉదయం 10 గంటల నుంచి తిరిగి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. కరోనా కేసుల నేపథ్యంలో వైరస్ నియంత్రణ, ప్రజల్లో అవగాహన, స్వీయ జాగ్రత్తలపై చైతన్యం కల్పిస్తూ పోలీస్ అధికారులు అలుపెరగని కృషి చేస్తున్నారు. – ఖమ్మం మే 21
నిబంధనలు కఠినతరం చేశాం
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేశాం. ప్రజల ప్రాణాల రక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యంగా భావించి విధులు నిర్వర్తిస్తున్నాం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలీసులు మూడు షిఫ్టుల్లో 24/7 విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు 8వేల మందికిపైగా కేసులు నమోదు చేశాం. సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.. పాజిటివ్ వచ్చిన సిబ్బందిని హోం ఐసోలేషన్లో ఉంచుతున్నాం..పోలీసుల కోసం ప్రత్యేక క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేశాం.. అందరికీ టీకాలు వేయించేలా చర్యలు తీసుకున్నాం..అత్యవసరమయితేనే ప్రజలు బయటకు రావాలి. అత్యవసరం ఉంటే ఉదయం 6 నుంచి 10 గంటలలోపు బయటకు రావాలి..ఖమ్మంలో చాలా మంది 8 గంటల తరువాత బయటకు వచ్చి 10 లోపు ఇంటికి వెళ్తున్నారు.దీని ద్వారా రద్దీ పెరుగుతున్నది. ఉదయం 6గంటలకే బయటకు వచ్చి వారి అవసరాలను తీర్చుకొని ఇంటికి వెళ్లాలి.
సిబ్బందిలో మనోధైర్యం నింపుతున్న సీపీ
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 550 మంది పోలీసులు లాక్డౌన్ విధులు నిర్వర్తిస్తున్నారు. లాక్డౌన్ అమలుతోపాటు ఉదయం నుంచి రాత్రి వరకు రహదారులపై తిరుగుతున్నారు. ఒకవైపు వాహనాల తనిఖీ చేస్తూనే.. మరోవైపు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. శాంతి భద్రతల కోసం నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నగర సీపీ విష్ణు ఎస్.వారియర్ సిబ్బందిలో మనోధైర్యం నింపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వారి ఆరోగ్య రక్షణకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఫేస్ షీల్డ్స్, మాస్క్లు, గ్లౌజ్లు అందించేలా చొరవ తీసుకున్నారు. పాజిటివ్ వచ్చిన సిబ్బందితో వీడియో కాల్లో మాట్లాడుతూ మనోధైర్యం నింపుతున్నారు. వారి కుటుంబసభ్యులతోనూ మాట్లాడుతూ బాసటగా నిలుస్తున్నారు. దీంతో సిబ్బంది మరింత ఉత్సాహంతో పని చేస్తున్నారు.
జిల్లాలో 8,000 కేసులు నమోదు..
కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీసుల విధులు కత్తి మీద సాములా తయారైంది. అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో విధులు నిర్వర్తిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రహదారులపై అనవసరంగా తిరిగేవారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. కారణం లేకుండా బయటకొచ్చిన సుమారు 8వేల మందిపై కేసులు నమోదు చేశారు. పలువురికి జరిమానా కూడా విధించారు. ఖమ్మం జిల్లా పరిధిలో 16 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వాటి వద్ద పోలీసులు 24 గంటలు విధులు నిర్వహిస్తూ వాహన తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లుపై కేసులు నమోదు చేస్తున్నారు.
70 మందికి పాజిటివ్..
ఖమ్మం జిల్లాలో సెకండ్ వేవ్లో 70 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. సీపీ విష్ణు ఎస్.వారియర్ ప్రత్యేక చొరవతో ఖమ్మం నగరంలోని ఎస్బీసీఐ ఇంజినీరింగ్ కళాశాలలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. అయితే, పోలీసులు ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారు. సీపీ ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ జాగ్త్రతలు వివరిస్తున్నారు. ఆయన ప్రత్యేక చొరవతో జిల్లాలో 96 శాతం మంది సిబ్బంది మొదటి డోస్ టీకా వేయించుకున్నారు. వీరిలో 80శాతం మందికి రెండో డోస్ కూడా పూర్తి అయ్యింది. మిగిలిన వారు టీకాలు వేయించుకునే దశలో ప్రభుత్వం వ్యాక్సినేషన్ను నిలిపివేసింది..
ప్రజలకు అవగాహన
లాక్డౌన్ అమలు, నిబంధనలు, అతిక్రమిస్తే తీసుకునే చర్యలపై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. సీపీ ఆదేశాలతో ఆటోలో మైకుల ద్వారా ఖమ్మం నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. నగరంలో ప్రధాన వ్యాపార, వాణిజ్య కేంద్రాలైన 24 ప్రదేశాల్లో ఏసీపీ స్థాయి అధికారిని కేటాయించి భౌతిక దూరం, మాస్క్లు ధరించడం, శానిటైజర్ వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఇష్టంగా ఉద్యోగంలో చేరా
పోలీస్ ఉద్యోగం అంటేనే సవాళ్లతో కూడుకున్నది. అయినా ఇష్టంగా ఈ ఉద్యోగంలో చేరా. ఎంతటి కష్టమైనా భరిస్తాం.. జిల్లా పోలీస్ బాస్ ఇచ్చే మనోధైర్యంతో విధులను నిర్వర్తిస్తున్నాం. ఇంట్లో పిల్లలు, పెద్ద వయస్సువారు ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి. క్షిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహించడం గర్వంగా ఉంది. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ కట్టడికి కృషి చేస్తున్నాం..
ప్రజల రక్షణ.. పోలీస్ బాధ్యత
ప్రజల రక్షణే మా బాధ్యత.. విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహించడం కత్తిమీద సామే అయినా ప్రజాశ్రేయస్సే పరమావధిగా పనిచేస్తున్నాం. ఉన్నతాధికారుల సహకారంతో ముందుకెళ్తున్నాం. 24 గంటల పాటు రోడ్లపైనే విధులు నిర్వర్తించాల్సి వస్తున్నది. వాహనాల తనిఖీ సమయంలో ఎవరికి పాజిటివ్ ఉందో.. ఎవరికి నెగటివ్ ఉందో తెలియదు. అయినా జాగ్రత్తలు తీసుకుంటూ పకడ్బందీగా విధులు నిర్వర్తిస్తున్నాం.
-పీ.సర్వయ్య
(సీఐ, మహిళా పోలీస్ స్టేషన్ , ఖమ్మం)