ఉత్సవ కమిటీలు, భక్త బృందాలు, భక్తులు నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాయి. సరస్వతి, కుంకుమ పూజలు, హోమాలు, అన్నదానాలతో హోరెత్తిపోయింది. తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న గణనాథుడు ఆదివారం గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా గణనాథుల ప్రతిమలను నిమజ్జనం చేయనున్నారు. శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహించేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
మామిళ్లగూడెం/ ఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం క్రైం, సెప్టెంబర్ 18: వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న గణనాథుడు ఆదివారం గంగ ఒడికి చేరుకోనున్నాడు. విఘ్ననాథుడి నిమజ్జనానికి ఉత్సవ కమిటీలు సిద్ధమయ్యాయి. అధికారులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఖమ్మం మున్నేరులోని నిమజ్జన ఘాట్లను కలెక్టర్, సీపీ, మేయర్ పరిశీలించారు. నిమజ్జనం, శోభాయాత్రల దృష్ట్యా ఆదివారం ఖమ్మం నగరంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉందని పలు మార్గాల్లో రాకపోకలను వేరే మార్గాలకు మళ్లించారు. ఉత్సవ కమిటీలు కూడా పోలీసులు సూచించిన రూట్లలోనే తమ విగ్రహాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. భద్రాద్రి జిల్లాలో 900 మందితో నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షించనున్నట్లు ఎస్పీ సునీల్దత్ తెలిపారు.
ఘాట్ల వద్ద ఏర్పాట్ల పరిశీలన..
మున్నేరు ఘాట్లలో గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మేయర్ నీరజ, సీపీ విష్ణు వారియర్తో కాల్వొడ్డు, ప్రకాశ్నగర్ ఘాట్లను శనివారం పరిశీలించారు.
డీజేలు బంద్..
గణేశ్ శోభాయాత్రలో డీజేల వినియోగం నిషేధమని కలెక్టర్ తెలిపారు. వాహనాల డ్రైవర్లు మద్యం, మత్తు పానీయాలు తీసుకోకుండా నిర్వాహకులు జాగ్రత్త వహించాలన్నారు. శోభాయాత్ర, నిమజ్జనాలను శాంతియుత వాతావరణంలో విజయవంతం చేయాలని భద్రాద్రి ఎస్పీ సునీల్దత్ కోరారు.
ఖమ్మంలో శోభాయాత్ర మార్గాలు ఇలా..
1.శ్రీరామ్ హిల్స్, సంభానినగర్, ముస్తాఫానగర్, చర్చికాంపౌండ్, కమాన్బజార్, కస్బాబజార్, స్టేషన్ రోడ్డు, బోనకల్లు రోడ్డు, జడ్పీ సెంటర్ ప్రాంతాలకు చెందిన గణేశ్ విగ్రహాలు చర్చికాంపౌండ్ నుంచి పటేల్ టింబర్ డిపో మీదుగా ప్రకాశ్నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ వద్దకు చేరుకోవాలి. లేదా పటేల్ టింబర్ డిపో నుంచి గుట్టలబజార్, గాంధీచౌక్ మీదుగా నయాబజార్కు చేరుకోవాలి
2.రాపర్తినగర్, బుర్హాన్పురం, మామిళ్లగూడెం, సరిత క్లినిక్ సెంటర్, గట్టయ్యసెంటర్కు చెందిన విగ్రహాలు బస్డిపో, ఆర్అండ్బీ గెస్ట్హౌజ్, మయూరిసెంటర్, కిన్నెరసెంటర్, జడ్పీ సెంటర్, చర్చీ కాంపౌండ్ నుంచి పటేల్ డింబర్ డిపో మీదుగా ప్రకాశ్నగర్ నిమజ్జన పాయింట్కు చేరుకోవాలి. లేదా గుట్టలబజార్ ద్వారా గాంధీచౌక్ నుంచి నయాబజార్ పాయింట్కు వెళ్లాలి.
3.రోటరీనగర్, ఇందిరానగర్, వీడీవోస్ కాలనీ, నెహ్రూనగర్, బ్యాంక్ కాలనీ, కవిరాజ్నగర్కు చెందిన విగ్రహాలు ఇల్లెందు క్రాస్రోడ్డు నుంచి జడ్పీ సెంటర్, చర్చికాంపౌండ్, పటేల్ టింబర్ డిపో మీదుగా ప్రకాశ్నగర్కు లేదా గుట్టలబజార్, గాంధీచౌక్ మీదుగా నయాబజార్ పాయింట్కు చేరుకోవాలి.
4.యూపీహెచ్ కాలనీ, ఖానాపురం, బల్లేపల్లి, బాలపేటకు చెందిన విగ్రహాలు ఎన్టీఆర్ సర్కిల్, ఇల్లెందు క్రాస్ రోడ్డు మీదుగా జడ్పీసెంటర్, చర్చికాంపౌండ్, పటేల్ టింబర్ డిపో మీదుగా ప్రకాశ్నగర్ పాయింట్కు లేదా గుట్టలబజార్, గాంధీచౌక్ నుంచి నయాబజార్ పాయింట్కు చేరుకోవాలి.
5.సారధీనగర్, ఎఫ్సీఐ గోడౌన్స్, వెంకటేశ్వరనగర్ విగ్రహాలు నెహ్రూ విగ్రహం, జూబ్లీక్లబ్, తహసీల్దార్ కార్యాలయం, గాంధీచౌక్ మీదుగా నయాబజార్కు చేరుకోవాలి.
6.ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మిగిలిన విగ్రహాలు మొత్తం గాంధీచౌక్, పీఎస్ఆర్ రోడ్డు, ట్రంక్ రోడ్డు మీదుగా నయాబజార్కు చేరుకోవాలి.
భక్తులకు సూచనలు..
-నిమజ్జనం తరువాత తిరుగు ప్రయాణంలో వాహనాలన్నీ హిందూ శ్మశాన వాటిక, పిల్లి చిన్న కృష్ణయ్య తోట, త్రీటౌన్ పోలీస్ స్టేషన్, పంపింగ్ వెల్ రోడ్డు, బోస్ బొమ్మ సెంటర్ నుంచి చర్చి కంపౌండ్ ద్వారా వెళ్లాలి.
-గణేశ్ నిమజ్జనం సందర్భంగా 19న మధ్యాహ్నం రెండు గంటల తరువాత నాయుడుపేట నుంచి వచ్చే అన్ని వాహనాలనూ మళ్లించి ములకలపల్లి క్రాస్ రోడ్డు, బైపాస్ రోడ్డు మీదుగా ఖమ్మం నగరంలోకి అనుమతించారు.
-ఖమ్మం నగరం నుంచి హైదరాబాద్, వరంగల్ వైపు వెళ్లే వాహనాలను నెహ్రూ విగ్రహం, ఎఫ్సీఐ గోడౌన్ల రూట్ ద్వారా బైపాస్ రోడ్డు మీదుగా అనుమతించారు.
-మయూరిసెంటర్ బ్రిడ్జి మీదుగా గణేశ్ విగ్రహ వాహనాలకు అనుమతిలేదు.
బందోబస్తులో పోలీసుల సేవలు ఇలా..
గణేశ్ నిమజ్జన పాయింట్లలలో బందోబస్తు విధుల్లో ఏసీపీలు-5, సీఐలు-13, ఎస్ఐలు-28, ఏఎస్ఐ/ హెడ్ కానిస్టేబుళ్లు-29, మహిళా హెడ్ కానిస్టేబుళ్లు/ మహిళా కానిస్టేబుళ్లు-10, హోంగార్డులు-50 మంది పాల్గొననున్నారు. ఏఆర్ ఫోర్సు-1 సెక్షన్ పాల్గొననుంది.
భద్రాద్రి జిల్లాలో భారీ బందోబస్తు: ఎస్పీ
భద్రాద్రి జిల్లాలో గణనాథుడి శోభాయాత్ర, నిమజ్జనం కోసం సుమారు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సునీల్దత్ తెలిపారు. భద్రాచలం నిమజ్జన కార్యక్రమానికి మణుగూరు ఏఎస్పీ శబరీష్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రతి సబ్ డివిజన్లో ముగ్గురు ఇన్స్పెక్టర్లు, సుమారు 8 మంది ఎస్సైలు, పీఎస్సైలు, 25 మంది ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లుతోపాటు కానిస్టేబుళ్లు, మహిళా పోలీస్, స్పెషల్ పార్టీ సిబ్బంది, వలంటీర్లు, హోంగార్డులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తగూడెంలో డీఎస్పీ వెంకటేశ్వరబాబు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 900 మంది అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు.