ఖమ్మం ఏప్రిల్ 17: కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నాయకత్వంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. శనివారం సాయంత్రం నగరంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. టీఆర్ఎస్ తరఫున టిక్కెట్టు రాని ఒక్కరిద్దరూ కాంగ్రెస్లో చేరినంత మాత్రాన టీఆర్ఎస్ ఖాళీ అయినట్లు ఎలా అవుతుందని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కను ఉద్దేశించి అన్నారు. నగరంలో జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో ఏ ఇతర పట్టణాలు, నగరాల్లో జరగలేదన్నారు. అన్ని ఎన్నికల్లో విజయం సాధించినట్లే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామన్నారు. మంత్రి పువ్వాడకు ఎలాంటి అక్రమ ఆస్తులు లేవన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఆస్తులను క్రమబద్ధీకరణ చేయించుకున్నారన్నారు. మంత్రి పువ్వాడను, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత భట్టీకి లేదన్నారు.