ఖమ్మం రూరల్, మే 15: అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఏమాత్రం సహించేది లేదని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ హెచ్చరించారు. మండలంలో పోలీసులు స్వాధీనపర్చుకున్న పేలుడు పదార్థాల వివరాలను శనివారం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఇలా వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలంలో పేలుడు పదార్థాల వ్యాపారం అక్రమంగా సాగుతున్నదని ఖమ్మం రూరల్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్ బృందం రంగంలోకి దిగింది. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద అఫ్జల్ మటన్ షాపు దగ్గర ఆటోలో నుంచి కారులోకి ఎక్కిస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఆటో డ్రైవర్ మాలప్రోలు ఉపేందర్, కారులో ఉన్న సామిరెడ్డి పూర్ణచందర్రెడ్డి, మచ్చా రమేష్ను అదుపులోకి తీసుకుని విచారించారు. పేలుడు పదార్థాల అక్రమ వ్యాపారం భారీగా కొనసాగుతున్నట్లుగా తేలింది. వారు ఇచ్చిన సమాచారంతో మండలంలోని పిట్టలవారిగూడెం గ్రామ సమీపంలోగల మామిడి తోటలో పేలుడు పదార్థాల గోడౌన్పై పోలీసులు దాడి చేశారు. అక్కడ బోడపట్ల సుదర్శన్రావును, నక్కబోయిన శ్రీనును అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించారు. బోడపట్ల రాజేందర్, ఐతగాని శ్రీను కలిసి అనుమతి లేకుండా పేలుడు పదార్థాల వ్యాపారం సాగిస్తున్నారు.
దీనికి సూపర్వైజర్గా బోడ్లపట్ల సుదర్శన్ ఉన్నాడు. వీటిని కొనేందుకు నక్కబోయిన శ్రీను వచ్చాడు. గోడౌన్లో సల్ఫర్ – 35 బ్యాగులు, బ్లాక్ పౌడర్ 12 బ్యాగులు, మిక్స్డ్ గన్ పౌడర్ 15 బ్యాగులు, బూస్టర్స్ – 30 బ్యాగులు, జిలిటెన్స్ స్టిక్స్ – 5 బ్యాగులు, డిటోనేటర్స్ – 950, డిటొనేటర్ ఫ్యూజ్ బాక్స్ – 1500 మీటర్లు, ఎక్స్ ఎల్ఈడీలు – 12 బండిళ్లు (8 మీటర్లు), మరో 20 బండిళ్లు – (4 మీటర్లు) ఉన్నాయి. వీటన్నింటినీ పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.15లక్షల 60వేలు. వీరికి చెందిన మారుతీ జెన్ కారు(ఏపీ 29 పీ 729)ను, ఆటో(ఏపీ 20 టీఏ 5406)ను సీజ్ చేశారు. నిందితుల నుంచి రూ.45,400ను స్వాధీనపర్చుకున్నారు. పేలుడు పదార్థాల అక్రమ వ్యాపారులైన ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన బోడ్లపట్ల రాజేంద్ర ప్రసాద్, ఐతగాని శ్రీనివాస్ పరారీలో ఉన్నారు. వీరితోపాటు అదే గ్రామానికి చెందిన బోడపట్ల సుదర్శన్రావు, మాలప్రోలు ఉపేందర్, నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం భీమునిపల్లి గ్రామానికి చెందిన నామిరెడ్డి పూర్ణచందర్రెడ్డి, మచ్చా రమేష్, ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరు గ్రామానికి చెందిన నక్కబోయిన శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను న్యాయస్థానాల్లో హాజరుపర్చనున్నట్లు సీపీ తెలిపారు. సమావేశంలో టాస్క్ఫోర్స్ ఏసీపీ బి.రామానుజం, రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి, రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై రవూఫ్, ఏఎస్సై గౌస్పాషా తదితరులు పాల్గొన్నారు.