ఉదయం పది గంటల వరకే బయటకు అనుమతి
నిర్మానుష్యంగా ప్రధాన రహదారులు
పటిష్టంగా పోలీసు బందోబస్తు
ఖమ్మం, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నాల్గోరోజూ లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగింది. సడలింపు వేళల్లో మినహా మిగతా రోజంతా రోడ్లన్నీ దాదాపుగా నిర్మానుష్యంగా మారాయి. అనుమతి లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహన చోదకులపై పోలీసులు ఒకింత కఠినంగా వ్యవహరించారు. అనవసరంగా బయటకు వస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలోని మధిర, బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం తదితర ప్రాంతాల్లో లాక్డౌన్ను ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పర్యవేక్షించారు. తెలంగాణకు సరిహద్దునగల రేమిడిచర్ల, దేశినేనిపాలెం చెక్పోస్టులను పరిశీలించారు. అక్కడి సిబ్బందికి సూచనలు చేశారు. సింగరేణి గనుల్లో బొగ్గు; కేటీపీఎస్, బీటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తి ఉత్పత్తి యథాతథంగా కొనసాగింది. సారపాక ఐటీసీలో ఉద్యోగులు, కార్మికులు విధులకు హాజరయ్యారు. భద్రాచలం రామాలయాన్ని ఉదయం 10 గంటల తర్వాత మూసివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో లాక్డౌన్ను ఎస్పీ సునీల్ దత్ పర్యవేక్షించారు. పెట్రోల్ బంకులు, వంట గ్యాస్ ఏజెన్సీలు అత్యవసర సర్వీసులు కొనసాగాయి. కొవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణ వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులను కలెక్టర్లు ఆదేశించారు. ఉభయ జిల్లాల్లో ఆక్సీజన్ కొరత లేదన్న విషయాన్ని ప్రజలకు తెలపాలని, కొవిడ్ బాధితులకు మనోధైర్యం ఇవ్వాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు.