నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్
హైదరాబాద్లో కలెక్టర్ కర్ణన్, మేయర్ నీరజతో సమీక్ష
ఖమ్మం, జూన్ 14: ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచి నిర్ధేశించిన సమయంలోగా పనులు పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. సోమవారం ఖమ్మం నగర అభివృద్ధిపై హైదరాబాద్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్కుమార్, ఖమ్మం కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో కొనసాగుతున్న సుడా నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు, గోళ్లపాడ్ చానల్ ఆధునీకరణ పనులు, ముఖ్యమంత్రి హామీ పథకం నిధులు, మిషన్ బగీరథ పనులు, వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ పనులు, వైకుంఠధామంలో అధనపు గదులు, తదితర పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలు, ఇంకా జరగాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలి
మంత్రి తారక రామారావు
అభివృద్ధి చెందిన ఖమ్మం నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసే దిశగా పనిచేయాలని ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారాలకు మంత్రి కె. తారక రామారావు సూచించారు. సోమవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో నూతనంగా ఎన్నికైన ఖమ్మం నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్లు మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఖమ్మం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని దిశా నిర్దేశం చేశారు. మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణం అభివృద్ధి చెందిందని, నూతన పాలకవర్గం మరింతగా అభివృద్ధి చేసేందుకు పనిచేయాలని ఉద్భోదించారు. ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్లను మంత్రి కేటీఆర్ అభినందించారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ ఉన్నారు.