జిల్లాలో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు
మండలస్థాయిలో టాస్క్ఫోర్స్ టీమ్లు ఏర్పాటు చేశాం
వీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం సీపీ విష్ణు ఎస్.వారియర్
ఖమ్మం జూన్ 11 : రైతులకు నష్టం కలిగించేలా జిల్లాలో ఎవరైనా నకిలీ, అనధికార విత్తనాలు అమ్మినా.. ఉపేక్షించేది లేదని, సంబంధిత డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీ విష్ణు ఎస్.వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో నకిలీ విత్తనాలను పూర్తిస్థాయిలో అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీపీ పోలీసు అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఐదేండ్లుగా విత్తనాలు కొనుగోలు చేసి వేసినా పంట దిగుబడులు రాక నష్టపోయిన రైతులు, నకిలీ విత్తనాలతో నష్టపోయినవారు, ప్రస్తుత పరిస్థితుల్లో నకిలీ మోసాలపై పోలీస్ వాట్సాప్ నంబరు 79011 44600కు సమాచారం ఇవ్వాలని కోరారు.
నకిలీ విత్తనాలు విక్రయించి అరెస్ట్ అయినవారి వివరాలు, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు, పంట నష్టం, విక్రయదారుల సమాచారాన్ని సేకరించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. నకిలీ విత్తనాల తయారీదారులు, మార్కెటింగ్, స్థానిక నెట్వర్క్ తదితర వివరాలు నిర్వహణ విధానాన్ని రూపొందించి కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. నకిలీ విత్తనాలను విక్రయించేందుకు ఆయా గ్రామాలకు వచ్చే ఏజెంట్లపై దృష్టిసారించి వారి సమాచారాన్ని సేకరించాలని పేర్కొన్నారు. స్థానిక పొలీసులతోపాటు టాస్క్ఫోర్స్ ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. జిల్లా సరిహద్దు చెక్పోస్టుల వద్ద వ్యవసాయశాఖ అధికారుల సహకారంతో పోలీసుశాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ టీమ్లను ప్రత్యేకంగా నియమించామన్నారు.