కూసుమంచి, మే 8 : మండలంలోని నాయకన్గూడెంలో పూర్తిస్థాయిలో ఇంటింటి సర్వేతో పాటు పారిశుధ్యంపై పం చాయతీ సిబ్బంది వైద్యారోగ్య శాఖ సిబ్బంది అంగన్వాడీలు, సర్పంచ్ కాసాని సైదులు, మాజీ సర్పంచ్ కంచర్ల వీరారెడ్డి, కార్యదర్శి ఉషారాణి భాగస్వాములం అవుతామ ని ప్రతిజ్ఞ చేశారు. అందరి సహకారంతో గ్రామంలో కొవిడ్ కట్టడికి చర్యలు చేపడతామన్నారు. పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఇంటింటి సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. లక్షణాలు ఉంటే ఐదు రోజులు మందులు వాడిన తరువాత ఆసుపత్రికి కొవిడ్ టెస్టులకు వెళ్లాలని కోరారు.
69మెడికల్ టీమ్ల ఏర్పాటు
కూసుమంచి, మే 8 : మండలంలోని 42 పంచాయతీల్లో 69 మెడికల్ టీమ్లతో ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు మండల వైద్యాధికారి డీడీఓ శ్రీనివాస్ తెలిపారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో టెస్టుల కోసం ఆసుపత్రులకు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడడంతో పాటు టీకాల కోసం వచ్చే వారికి రక్షణ లేకుండా పోతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, పంచాయతీ సిబ్బందితో సర్వేలు చేయిస్తున్నట్లు తెలిపారు.
జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
చింతకాని, మే 8 : పల్లెల్లో ఇంటింటి జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో దావులూరి లలితకుమారి అన్నారు. మండల పరిధిలో 26గ్రామాల్లో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వేను ఆయా గ్రామల సర్పంచులతో కలిసి ఆమె పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో ప్రతి వెయ్యి మంది ఇండ్లకు ఓ టీం చొప్పున మండలవ్యాప్తంగా 56టీమ్లు పని చేస్తున్నాయన్నారు. జ్వరాల బారిన పడిన వారి వివరాలు సేకరిస్తున్నారని, ప్రతి రోజు 50-80 ఇండ్లు సర్వే నిర్వహిస్తారని ఆమె తెలిపారు. సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్, ఎంపీటీసీలు, కార్యదర్శులు, అంగన్వాడీ, ఆశా, పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటింటా వైద్యపరీక్షలు..
బోనకల్లు, మే 8 : మండలంలోని బోనకల్లు, రావినూతల, ఆళ్లపాడు గ్రామాల్లో గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో సర్పంచ్లు మర్రి తిరుపతిరావు, భుక్యా సైదానాయక్ శనివారం ఇంటింటా వైద్యపరీక్షలను చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో కరోనా కేసులు అధికమవుతున్నందున నివారించేందుకు ఇంటింటికీ వెళ్లి వైద్యపరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షల్లో జ్వరం, దగ్గు, జలుబు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి వెంటనే హోంక్వారంటైన్లో ఉంచి వారికి మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్లు ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ, హుస్సేన్బీ, గౌరమ్మ, పంచాయతీ కార్యదర్శులు పరశురాం, అశోక్, కిరణ్, ఆశాకార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
మధిర మున్సిపాలిటీలో…
మధిరరూరల్, మే 8 : మున్సిపాలిటీ పరిధిలోని పలువార్డుల్లో శనివారం జ్వర సర్వే, పల్స్చెకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిఇంటికీ వెళ్తూ జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తూ వారికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కరోనా సెకండ్వేవ్ విజృంభిస్తున్నందున ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ మాస్క్లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, ఆశాకార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.
ఎర్రుపాలెంలో..
ఎర్రుపాలెం, మే 8 : మండలంలోని పలుగ్రామాల్లో పంచాయతీ, వైద్యశాఖల ఆధ్వర్యంలో ఇంటింటా జ్వర సర్వేలో భాగంగా అంగన్వాడీ సిబ్బంది, ఆశావర్కర్లు సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా జ్వరం, ఒళ్లునొప్పులు లాంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తూ ఆక్సిజన్ లెవల్స్ టెస్టు చేస్తూ వారిని ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, కార్యదర్శులు, అంగన్శాడీ, ఆశా, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
బీమవరంలో శానిటైజేషన్..
ఎర్రుపాలెం, మే 8 : మండలంలోని బీమవరం గ్రామపంచాయతీలో సర్పంచ్ శీలం జయలక్ష్మీ ఆధ్వర్యంలో శనివారం శానిటైజేషన్, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా వీధుల వెంట శానిటైజర్లు పిచికారీ చేశారు. సైడ్కాలువలు, రోడ్ల పక్కన బ్లీచింగ్పౌడర్ చల్లించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శీలం కవిత, సర్పంచ్ శీలం జయలక్ష్మీ, ఎంపీటీసీ సంక్రాంతి కృష్ణారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేగిరెడ్డి శ్రీకాంత్రెడ్డి, వార్డుసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.