భద్రాచలం, మే 5: భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో వైశాఖ మాసంలో నిర్వహించాల్సిన ఉత్సవాల గురించి వైదిక కమిటీ దేవస్థానానికి నివేదికను ఇచ్చింది. నివేదికలోని వివరాల ప్రకారం.. ఈ నెల 14న శుక్రవారం సంధ్యాహారతి, రాత్రికి చుట్టు సేవ, 15న వృషభ సంక్రమణం, రాత్రికి చుట్టు సేవ ఉంటాయి. పవళింపు సేవ ఉండదు. 17న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం మూలవరులకు విశేష స్నపనం, శ్రీరామ పునర్వసు దీక్ష విరమణ, సంక్షేప రామాయణ హవనం, పూర్ణాహుతి, గిరి ప్రదక్షిణ, రాత్రికి వైభవంగా రథోత్సవం ఉంటాయి. 18న పుష్యమి నక్షత్రం సందర్భంగా రామయ్యకు పట్టాభిషేకం. 21 నుంచి నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ప్రతి రోజూ నమ్వాళ్వార్కు మధుర పదార్థాలతో నివేదన జరుపుతారు. 23న శ్రీ వైష్ణవ ఏకాదశి సందర్భంగా సాయంత్రం శ్రీసత్యనారాయణ స్వామివారి వార్షిక తిరుకల్యాణం ఉంటుంది. 24న చిత్తా నక్షత్రం సందర్భంగా యాగశాలలో సుదర్శన హోమం నిర్వహిస్తారు. ఆ రోజు నుంచి 29 వరకు శ్రీయోగానంద లక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక పాంచాహ్నిక తిరు కల్యాణ మహోత్సవాలు ఉంటాయి. జూన్ 2 నుంచి 4 వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలు కొనసాగుతాయి. గతంలో మాదిరిగానే సుందరకాండ పారాయణం చేసిన వారికి దీక్షా వస్ర్తాలు సమర్పించి పారాయణం జరుపుతారు. జూన్ 4న ఆంజనేయ స్వామివారికి తమలపాకులతో సహస్ర నామార్చన, రాత్రికి స్వామివారితో పాటుగా ఆంజనేయ స్వామివారికి కూడా తిరువీధి సేవ నిర్వహిస్తారు. అన్ని ఉత్సవాలు కొవిడ్ నిబంధనల ప్రకారమే జరుగుతాయి.