ప్రభుత్వ శాఖల్లో ఖాళీల ఆధారంగా భర్తీ
ఆఫీస్ సబ్ఆర్డినేట్ పోస్టులకునియామకాలు
ఖమ్మం, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అకాలమరణం చెందిన వారి కుటుంబంలో అర్హులకు కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ ఖమ్మం జిల్లాలో వేగంగా కొనసాగుతున్నది. ఉద్యోగాలు ఇవ్వాలంటూ అర్హులైన కుటుంబ సభ్యులు చేసుకున్న దరఖాస్తులను ఇటు జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ దరఖాస్తు సీనియారిటీ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు.
వేగంగా ప్రక్రియ..
2018 నుంచి కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 192 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. సంబంధిత శాఖల్లో ఖాళీల ఆధారంగా అభ్యర్థుల విద్యార్హతలను బట్టి నియామకాలను చేపడుతున్నారు. ఇప్పటివరకు 85 మందికి పోస్టింగ్లు ఇచ్చారు. అన్ని ప్రభుత్వశాఖల నుంచి 107 మరో మందికి కారుణ్య నియామకాల కింద కొలువులు ఇవ్వాల్సి ఉంది. జిల్లా పరిషత్ పరిధిలో కారుణ్య నియామకాల కోసం 81 దరఖాస్తులు రాగా ఖాళీల ప్రాతిపదికన ఎప్పటికప్పుడు పోస్టింగ్ ఇస్తున్నారు. దాదాపు 17 మందికి ఇప్పటివరకు ఆఫీస్ సబ్ఆర్డినేట్ పోస్టింగ్లు ఇవ్వగా ఏడుగురికి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చారు. 57 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కలెక్టరేట్ పరిధిలో వివిధ శాఖలకు సంబంధించి 120 దరఖాస్తులు రాగా 70 మందికి పోస్టింగ్లు ఇచ్చారు. ఇంకా 50 మందికి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో ఆఫీస్ సబ్ఆర్డినేట్ పోస్టులు ఖాళీగా ఉండడం, కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువమంది జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగానికి అర్హత కలిగి ఉన్నారు. దీంతో అధిక విద్యార్హతలు కలిగిన వారితో ఆఫీస్ సబ్ఆర్డినేట్ పోస్టులను భర్తీ చేయలేకపోతున్నామని అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఏర్పడిన వెంటనే దరఖాస్తుదారుల సీనియారిటీ అర్హతల ప్రాతిపదికన తక్షణం నియామకాలు చేపట్టనున్నారు.
ఇవి కూడా చూడండి..
1 నుంచి 8వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పాస్..!
విధుల నుంచి ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబ తొలగింపు