ఖమ్మం నుంచి రాపర్తి సోదరులు, మధిర నుంచి మల్లాది దంపతులు
మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు ముఖ్య నాయకుల షాక్
టీఆర్ఎస్తోనే ఖమ్మం నగర అభివృద్ధి సాధ్యమని ప్రకటన
ఖమ్మం/ మామిళ్లగూడెం/ మధిర, ఏప్రిల్ 2: ఖమ్మం పర్యటన కోసం శుక్రవారం వచ్చిన రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సమక్షంలో ఖమ్మం నగరం, మధిర పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ చేరారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంత్రి అజయ్కుమార్ అధ్యక్షతన జరిగిన చేరికల కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మధిర మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ మల్లాది వాసుదేవరావు, మరో కౌన్సిలర్ మల్లాది సవితలతోపాటు కాంగ్రెస్ నాయకులు చావా రవి, నాగేశ్వరరావు, నాగరాజు సహా పెద్ద ఎత్తున మధిర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఖమ్మం మున్సిపల్ మాజీ చైర్మన్, దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత రాపర్తి రంగారావు కుటుంబ సభ్యులు కూడా టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్లో కీలకపాత్ర పోషిస్తున్న రాపర్తి శరత్కుమార్ ఆధ్వర్యంలో రాపర్తి రవికుమార్, రాపర్తి సత్యనారాయణ, రాపర్తి సంపత్, రాపర్తి నర్సింహారావు, డాక్టర్ రాపర్తి సురజ్సాయి, రాపర్తి అరవిందకుమార్, రాపర్తి లక్ష్మణ్, రాపర్తి సంతోష్లకు గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్లోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్లయింది.
కేటీఆర్ను కలిసిన శేషు, కర్నాటి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ను టీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమకారుడు గుండ్లపల్లి శేషు, మాజీ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ కలుసుకున్నారు.