ఒకేరోజు 70 వేల బస్తాలను తీసుకవచ్చిన రైతులు
జెండాపాటలో గరిష్ఠ ధర రూ.15,300
ప్రశాంతంగా ముగిసిన క్రయవిక్రయాలు
ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 1: ఖమ్మం ఏఎంసీకి గురువారం భారీగా మిర్చి పంట పోటెత్తింది. మార్కెట్లోని రెండు ప్రధాన యార్డులు మిర్చి బస్తాలతో కిక్కిరిసిపోయాయి. గడిచిన పక్షం రోజుల క్రితం ఇదే తరహాలో ఒకేరోజు 70 వేల బస్తాలు రాగా.. ఈ సీజన్లో మరోసారి అదే తరహాలో పంట వచ్చింది. మహబూబాబాద్, కేసముద్రం, వరంగల్ మార్కెట్లకు సెలవులు ప్రకటించడం, పంట చేతికి వచ్చే సీజన్ కావడం కావడంతో రైతులు భారీగా పంటను తీసుకవచ్చారు. గురువారం తెల్లవారుజాము వరకు వేలాది మంది రైతులు పంటను తీసుకురావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న చైర్మన్ మద్దినేని వెంకటరమణ.. సెక్రటరీ మల్లేశంతో కలిసి జెండాపాట నిర్వహణను పర్యవేక్షించారు. దీంతో జెండాపాటలో గరిష్ఠ ధర క్వింటాకు రూ.15,300 పలికింది. కనిష్ట ధర రూ.8,500, మధ్య ధర రూ.14,500 చొప్పున నిర్ణయించి ఖరీదుదారులు కొనున్నారు. తాలు రకం రికార్డు స్థాయిలో క్వింటాకు రూ.8,500 పలికింది. రానున్న రోజుల్లో మార్కెట్కు వరుస సెలవులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు రెండు మూడు రోజుల నుంచి భారీగా పంటను తీసుకవస్తున్నారు. విదేశాలకు ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి. ఎగుమతిదారుల నుంచి ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు వస్తున్నందున వ్యాపారులు పోటీపడి కొంటున్నారు.