రూ. 3.11 కోట్ల వ్యయంతో నిర్మాణం
నేడు ప్రారంభించనున్న మంత్రులు
సత్తుపల్లి, ఏప్రిల్ 1: ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో సత్తుపల్లి పట్టణంలోని మీసేవా సముదాయానికి సమీపంలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఎకరం విస్తీర్ణంలో అధునాతన హంగులతో రూ.3.11 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించారు. ఈ భవన సముదాయం నిర్మాణంలో భాగంగా 17 గదులతోపాటు కలెక్టర్ చాంబర్, కమిషనర్ చాంబర్, చైర్మన్ చాంబర్తోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు కూర్చునేందుకు అసెంబ్లీ తరహాలో పోడియం తదితర విభాగాలను ఏర్పాటు చేస్తూ నూతన భవనాన్ని తీర్చిదిద్దారు. కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద పౌరసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాని ఎదుట ఆర్యవైశ్యుల సంఘం, వాసవీ క్లబ్ సహకారంతో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నూతన కార్యాలయ భవన సముదాయం రెండు అంతస్తులతో నిర్మాణమైంది. అటు పాలకవర్గానికి ఇటు సిబ్బందికి, ఉద్యోగులకు అన్ని వసతులూ కల్పిస్తూ భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ భవనాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించనున్నారు. వేంసూరు రోడ్డులోని దోబీఘాట్ సమీపంలో నిర్మించిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. బస్టాండ్ సమీపంలోని వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్కు శంకుస్థాపన చేయనున్నారు.