చింతకాని : నిరుపేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ సారధ్యంలో అద్భుతమైన పథకాలు అమలుచేస్తున్నారని, దళితబంధు ప్రకటనతో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగిందని జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు అన్నారు. శుక్రవారం మండల పరిధిలో మత్రేపల్లి నామవరం గ్రామంలో సర్పంచ్ తిరుపతి కోండలరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన 50 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీలో చేరాయి. వారికి జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమ పార్టీగా, అధికార పార్టీగా ఎంతో అభివృద్ధి సాగిస్తున్నదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతరపార్టీల నుంచి నేతలు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ వైపు పరుగులుపెడుతున్నారన్నారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యాన్ని కూడా కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతిపక్ష నాయకులు పభుత్వ పథకాలు, సంక్షేమం చూసి తట్టుకోలేక అధికార పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నా రన్నారు. ప్రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని, మోసపూరిత నాయకుల మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని వివరించారు.
కలిసికట్టుగా పార్టీ కోసం కృషిచేసి గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్లో గ్రామాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, జడ్పీటీసీ పర్చగాని తిరుపతి కిశోర్, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, వైస్ఎంపీపీ గురజాల హనుమంతరావు, సర్పంచులు తిరుపతి కోండలరావు, చాట్ల సురేశ్, తుడుం రాజేశ్, నాయకులు మంకెన రమేశ్, కోండపల్లి శేఖర్రెడ్డి, నల్లమోతు శేషగిరి, వేముల నర్సయ్య, చల్లా అచ్చయ్య, నారపోగు నాగయ్య, దేవరగట్ల శ్రీను, సునిత, తిరుపతి రామ్మూర్తి, చలమయ్య, ముఖ్య కార్యకర్తలు, దళితసంఘాల నాయకులు, దళితులు పాల్గొన్నారు.