ఖమ్మం : ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలమేరకు జిల్లాలోని పల్లె దవాఖానాల్లో వైద్యాధికారుల పోస్టులభర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ బీ. మాలతి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంబీబీఎస్ కోర్సు పూర్తిచేసి తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అర్హులని, 2021 జులై నాటికి 34 సంవత్సరాలు నిండి ఉండాలని ఆమె
వెల్లడించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏండ్లు, ఎక్స్ సర్వీస్ మెన్కు 3 ఏండ్లు సడలింపు ఉంటుందని తెలిపారు. నియామకాలు రోల్ ఆఫ్ రిజర్వేషన్లను అనుసరించి జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్న సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా 90శాతం, వయస్సు ప్రాతిపదికన 10శాతం కలుపుకుని మెరిట్ జాబితాను రూపొందిస్తామన్నారు.
జిల్లాలోని బోదులబండ పీహెచ్సీ పరిధిలో-5, బోనకల్-8, చెన్నూరు-5, చింతకాని-9, ఏన్కూరు-10, కల్లూరు-5, కామేపల్లి-5, మంచుకొండ-9, సింగరేణి-4, తల్లాడ-9, వేంసూరు-8, వైరా-9 మొత్తం కలిపి జిల్లాలోని 86 పల్లె దవాఖానాల్లో ఖాళీలు ఉన్నట్లు ఆమె వెల్లడించారు.