కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 6:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూగర్భజలాలు స్థిరంగా ఉన్నాయి. గడిచిన ఏడేళ్లుగా సురక్షితస్థాయిలో ఉంటున్నాయి. ప్రత్యేకించి వర్షపాతం నిరుడు అనుకున్నస్థాయిని మించింది. ఏకంగా 90 శాతం అధికంగా నమోదైంది. ఈ ఏడాది వర్షాలు 30 శాతం ఎక్కువగా కురిశాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన చెక్డ్యాంల నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా జరిగిన చెరువుల పునరుద్ధరణ వంటివి ఇందుకు దోహదపడ్డాయి. ‘జలశక్తి అభియాన్’ పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేయడం, భూగర్భ జలాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి ఎంతగానో ఉపయోగపడ్డాయి. నీటిని పొదుపుగా వాడుకోవడం, ఉపయోగించిన నీటిని ఇంకుడుగుంతలతో మళ్లీ భూమిలోకి మళ్లించడం వంటి చర్యలు భూగర్భజలం స్థిరంగా ఉండడానికి వీలు కలిగింది.
జిల్లాలో పదిమీటర్లలోపే భూగర్భజలమట్టం ఉందని అధికారులు చెబుతున్నారు. 62 చోట్ల భూగర్భజలాన్ని కొలిచే ఫీజోమీటర్లను ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగా నీటిమట్టాన్ని సులువుగా కొలుస్తున్నారు. సంవత్సరకాలం నుంచి నీటిమట్టం స్థిరంగానే కొనసాగుతుంది. సరాసరి నీటిమట్టం 2020 నవంబర్లో 5.57 మీటర్లు కాగా.. ప్రస్తుత నవంబర్లో 5.59 మీటర్లుగా ఉంది. జిల్లాలో మొత్తం 23 మండలాలుండగా వాటిల్లోని 17 మండలాల్లో 10 మీటర్లలోపే భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా జలాలను వినియోగించే దమ్మపేట మండలంలో 39.59 మీటర్లు, అశ్వారావుపేటలో 38.56 మీటర్లు, చండ్రుగొండలో 17.03 మీటర్లు, కొత్తగూడెంలో 18.80 మీటర్ల లోతులో జలాలు లభ్యమవుతున్నాయి. ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో అధిక వర్షాలు కురిసిన సమయంల్లో గుండాల, ఆళ్లపల్లి వంటి ఏజెన్సీ మండలాల్లో బోర్లు, మోటర్ల నుంచి భూగర్బజలాలు ఉబికి వచ్చిన విషయం విదితమే.
అధికారుల లెక్కల ప్రకారం దమ్మపేట మండలంలో భూగర్భ జలాలను ప్రజలు అత్యధికంగా వినియోగించుకుంటున్నారు. అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించడం, బోర్లకు నూతన టెక్నాలజీలో కేసీంగ్ వేయడం వల్ల భూగర్భ జలాల వినియోగం ఎక్కువగా జరుగుతోంది. ఆ ప్రాంతంలో నేల స్వభావం (మెతకరాయి) కూడా నీరు నిల్వ ఉండకపోవడానికి మరో కారణం. 100 హెక్టామీటర్ల కంటే ఎక్కువగా నీటిని ఉపయోగించినట్లయితే దానిని డేంజర్ జోన్గా నిర్ణయిస్తారు. భూగర్భ జలాల వినియోగించడంలో ఈ మండలం ముందు వరుసలో ఉన్నందున ఇక్కడ చెక్డ్యాంలతో నీటిని నిల్వ చేసుకొని వినియోగించుకోవాల్సిన ఉంటుంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలో పోలిస్తే భూగర్భ జలాల పరిరక్షణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెరుగైన స్థానంలోనే ఉందని భూగర్భజల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు
జిల్లాలో భూగర్భజలాలు స్థిరంగానే ఉన్నాయి. చాలా మండలాల్లో కేవలం పది మీటర్లలోపే జలాలు లభిస్తున్నాయి. జిల్లాలో నీటివనరులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. జిల్లా వాసులు 25 శాతం మాత్రమే భూగర్భజలాలను వినియోగించుకుంటున్నారు. భవిష్యత్లో తాగు, సాగునీటితోపాటు పరిశ్రమల వినియోగానికి కూడా సరిపడా నీరు ఉండేలా చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’, ‘జలశక్తి అభియాన్’ పథకాలపై విస్తృత ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.-ఎం.బాలు, జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం