పెనుబల్లి : సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి డబ్బులు వసూలు చేసి, ఆపై విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వీఎం బంజరులో చోటు చేసుకున్నది. సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన అక్కిరెడ్డి నరేశ్కుమార్రెడ్డి కొంతకాలంగా స్విస్మా టెక్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలు గ్రామాల యువకులకు మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేశాడు. అమాయక యువకులను మోసం చేస్తూ విదేశాలకు వెళ్లడం, మళ్లీ వచ్చి మరికొంత మందిని మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడు.
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నరేశ్కుమార్ తమిళనాడు పుదుచ్చేరి ఎయిర్పోర్టుకు వెళ్తున్న సమయంలో వీఎం బంజరు పోలీసులు అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం సత్తుపల్లి కోర్టులో హాజరు పరచగా.. న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్కు తరలించాలని ఆదేశించారు.