ఖమ్మం :మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వంపెద్దపీట వేసిందని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు బుధవారం ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ చెరువులో తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా అందచేస్తున్న చేప పిల్లలను మేయర్ చెరువులో వదిలారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు.
ముఖ్యంగా వ్యవసాయరంగాన్ని ఎంతో అభివృద్ది చేశారని అన్నారు. నూటికి 80శాతం మంది ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారని అందుకనే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా అభివృద్ది పర్చాలనే ఉద్దేశ్యంతోప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను సరఫరా చేస్తుందని తెలిపారు. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక చొరవతో లకారం చెరువును అభివృద్ది చేశారని అన్నారు.
ట్యాంక్ బండ్గా అభివృద్ది చేయడం ద్వారా ఖమ్మం నగరానికి లకారం చెరువు ఒక ఐకాన్గా మారిందన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, సీనియర్ టిఆర్ఎస్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, కార్పోరేటర్ సరిపూడి రమాదేవి,యువజన నాయకులు సరిపూడి గోపి, మత్స్యశాఖ ఏడీ ,సొసైటీ అధ్యక్షులు బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.