ఖమ్మం : దళిత సాధికారత సాధనకు ప్రతి అధికారి కుటుంబ పెద్దగా వారి ఆర్థిక ఎదుగుదలకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ సూచించారు. జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో దళితబంధు అమలు, మార్గదర్శకాలు, అనుసరించాల్సిన పద్దతులపై జిల్లా అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్మ్రాకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు ద్వారా దళితులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు జిల్లా అధికారులు గ్రామస్థాయిలో దళితుల స్థితిగతులను తెలుసుకుని వారికి సహకారం అందించాలన్నారు. జిల్లాలో మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలాన్ని దళిత బంధు పథకం అమలుకు పైలెట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి ప్రకటించారని దీని పట్ల ప్రతి అధికారి పూర్తి అవగాహనతో ఉండాలన్నారు.
దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో ఏళ్లుగా అవకాశాలు లేక వెనుకబడి ఉన్నారని ఇలాంటి వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో వారి ఆర్థిక ఎదుగుదలకు దళిత బంధు ప్రాజెక్టును తీసుకొచ్చారని తెలిపారు.