ఖమ్మం: యాసంగి సీజన్లో జిల్లా రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మల్లించాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. వచ్చే యాసంగిలో ధాన్యం కొనుగోలు ఉండదని ఎఫ్సీఐ ప్రకటించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో వచ్చే యాసంగిలో రైతులను వరికి ప్రత్యామ్నాయం పంటల వైపు మళ్లించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, విత్తన విక్రయ డీలర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగిలో కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే సాగవుతుందని బాయిల్డ్ రైస్ ఎఫ్సీఐ కోనుగోలు చేయదని తేల్చి చెప్పిందని ఈ సందేశం జిల్లా రైతులకు చేరవేసి భూసారానికి అనుకూలంగా వరికి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించాలని తదనుగుణంగా ఈ నెల 27 నుంచి 29 వరకు ప్రతి రైతు వేదికలో పెద్ద ఎత్తున రైతు అవగాహన సదుస్సుల ద్వారా రైతులను చైతన్య పర్చాలని ఆదేశించారు.
జిల్లాలో మండలాల వారిగా ప్రాంతాల వారిగా భూసారానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలపై శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో రైతులకు ఆదాయం లభించే పంటల సాగుకోసం ఈ నెల 30వ తేదిలోపు జిలత్లా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్దం చేయాలని సూచించారు. దీనిపై వ్యవసాయ విస్తరణాధికారులకు ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించడం ద్వారా క్లస్టర్ స్థాయిలో ప్రతి రోజు రైతుల చెంతకు వెళ్లి పూర్తి అవగాహన పర్చి యాసంగిలో రైతులందరూ వరికి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసే విధంగా సన్నద్దం చేయాలని ఆదేశించారు.