ఖమ్మం: జిల్లాలో 18ఏండ్లు పైబడిన వారందరికీ వందశాతం కోవిడ్-19 వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ వి.పీ.గౌతమ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్కుమార్ గురువారం రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన టెలీకాన్పరెన్స్లో జిల్లాలో చేపట్టిన స్పెషల్డ్రైవ్ ను గురించిన కలెక్టర్ వివరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో 214 సబ్ సెంటర్లలో, అర్బన్ ప్రాంతాలలో125 వార్డులలో ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందని, నేటి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు,సిబ్బంది, ఆశావర్కర్లు,ఏఎన్ఎమ్లు, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యంతో గ్రామాలలో ప్రత్యేక సర్వే చేస్తూ కోవిడ్ టీకా తీసుకోని వారిని గుర్తించి అందరూ టీకాలు చేసుకునేలా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
అర్బన్ ప్రాంతాలలో ప్రతి వార్డుకు ప్రత్యేక బృందం వెళ్లి ఇంటిని సందర్శించి వివరాలు సేకరించడంతో పాటు కోవిడ్ టీకా తీసుకున్న సమాచారం తెలిపేలా స్టిక్కర్లును అంటించడం జరుగుతున్నదని కలెక్టర్ వివరించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు ఎంఎల్సీలు, ఎంఎల్ఏలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారని అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం సమన్వయంతో ప్రతి గ్రామం, ప్రతి వార్డు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా టీకా కార్యక్రమం జరగాలని సోమేష్ కుమార్ అన్నారు.
టీకాలకు సంబంధించి రోజువారీ నివేదికలను ప్రతి రోజు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేష్కుమార్ సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి, జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ రాజేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అలివేలు తదితరులు పాల్గొన్నారు.