పెనుబల్లి : దేవాలయాల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమౌతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50లక్షలతో నీలాద్రీశ్వర ఆలయ ప్రాకార మండపం పనులకు శంఖుస్థాపన, చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో దేవాలయాలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో అధ్యాత్మిక చింతన కలిగి ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యాత్మిక చింతనపై దృష్టి సారించి ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు.
యాదాద్రి దేవాలయం, రామప్ప దేవాలయానికి ప్రపంచ స్థాయి గుర్తింపును సాధించిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. తాను టీటీడీ పాలకమండలి సభ్యునిగా ఉన్న సమయంలో ఎన్నో భజన మందిరాలు, దేవాలయాలకు నిధులు అందించడం జరిగిందని, భద్రాచలం, అన్నపురెడ్డి, ఆదిలాబాద్, హైదరాబాద్ నగరంలో కూడా దేవాలయాలకు నిధులు మంజూరు చేయించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ భక్తిభావం కలిగి ఉన్నప్పుడు ప్రశాంత వాతావరణం ఉంటుందని, తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
నీలాద్రి దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, రూ.50లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పీవీ రమణ, దేవాదాయ శాఖ ఏఈ మోహన్రావు, ఆలయ ఛైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు, జడ్పీటీసీల జిల్లా ఫోరం కన్వీనర్ చెక్కిలాల మోహన్రావు, ఏఎంసీ ఛైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్రావు, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ సోమరాజు రామప్ప, సీడీసీ ఛైర్మన్ ముక్కర భూపాల్ రెడ్డి, పాతకారాయిగూడెం సొసైటీ ఛైర్మన్ చింతనిప్పు సత్యనారాయణ, ఆలయకమిటీ బాధ్యులు వంగా చిన్నపండు, వంగా గిరిజాపతి తదితరులు పాల్గొన్నారు.