ఖమ్మం, సెఫ్టెంబర్ 23: తెలంగాణ జీవనచిత్రం బతుకమ్మ అని చీరెల పంపిణీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో హేళనకు గురైన బతుకమ్మను నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మనం గౌరవించుకుంటున్నామని గుర్తుచేశారు. నగరంలోని 17, 27, 29, 31 డివిజన్లలో శుక్రవారం పర్యటించిన ఆయన ఆయా డివిజన్లలో మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేసి మాట్లాడారు. పూలను పూజించే సంస్కృతి తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదని అన్నారు. ఈ నెల 25 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్న సందర్భంగా మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామని అన్నారు. అనంతరం నగరంలోని పలు డివిజన్లలో రూ.1.80 కోట్లతో చేపట్టనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు మంత్రి అజయ్కుమార్ శంకుస్థాపన చేశారు. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కమిషనర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ, సుడా చైర్మన్లు కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ చలువతోనే అభివృద్ధి..
సీఎం కేసీఆర్ చలువతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని మంత్రి అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. నగరంలోని 10వ డివిజన్ చైతన్య నగర్లో మున్సిపల్ సాధారణ నిధులు రూ.45 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు శుక్రవారం వారు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.25 లక్షలతో నిర్మించిన పంచతంత్ర పార్కును ప్రారంభించారు. తరువాత ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలు, గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. డివిజన్ సెంటర్లో ఏర్పాటు చేసిన రచ్చబండను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభివృద్ధిలో అనేక రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించబోతున్నట్లు చెప్పారు. చావా మాధురి, చావా నారాయణరావు, నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.