కారేపల్లి, అక్టోబర్ 4 : రాష్ట్రంలో రెండో పెద్దజాతరగా పిలువబడే ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ జాతర బుధవారం ప్రారంభంకానుంది. ప్రతి యేడు దసరా పండుగను పురస్కరించుకొని జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గత నెల 26వ తేదీ నుంచి తొమ్మిదిరోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. కొలిచిన వారి కొంగుబంగారమై కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధికెక్కిన కోటమైసమ్మ తల్లి జాతర భక్తులకు కనువిందు చేయనున్నది. వారంరోజుల పాటు కొనసాగే జాతరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
కోటమైసమ్మ జాతరను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ చిన్నాపెద్దలకు ప్రత్యేక వినోదపు వాతావరణం సంతరించుకుంటుంది. జాతరలో ఏర్పాటు చేసే జాయింట్ వీల్స్ ఇక్కడి ప్రత్యేకం. రంగులరాట్నం మీద కుటుంబ సమేతంగా ఆనందాన్ని ఆస్వాదిస్తారు. ఈ ఏడాది ఇంకా కొన్ని ప్రత్యేకమైన వినోదపు యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మూడు రకాల జాయింట్వీల్స్, కొలంబస్, బైక్రేస్, స్కార్పియోరేస్, మినీట్రైన్, బ్రేక్డ్యాన్స్, సాలంబో, డ్రాగన్ట్రైన్, గుర్రాలరాట్నం, కారురేస్, దూంబైక్, సర్కస్, సక్కుబాయి రికార్డింగ్ డ్యాన్స్, మ్యాజిక్షో వంటి వివిధ రకాల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకునే విధంగా హైదరాబాద్, కావలి, వరంగల్ నుంచి నిర్వాహకులు తరలివచ్చి ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాట్లు పూర్తైనట్లు అధికారులు తెలిపారు.
కొలువైన దేవతామూర్తులు
కోటమైసమ్మ ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను దర్శించుకున్న అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం సంప్రదాయం. ఇక్కడ ఏర్పాటు చేసిన పంచముఖాంజనేయస్వామి, కైలాసనాథుడు, విఘ్నేశ్వరస్వామి, సరస్వతీ అమ్మవారు, పంచముఖ నాగేంద్రస్వామి తదితర దేవతా విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి.