నమస్తే తెలంగాణ, నెట్వర్క్ ;దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు ఆదివారం సరస్వతీదేవిగా దర్శనభాగ్యం కల్పించారు. వరంగల్ భద్రకాళీ ఆలయం, ఏడుపాయల వనదుర్గా ఆలయం, వర్గల్ విద్యాధరిక్షేత్రం, విజయవాడ కనకదుర్గ ఆలయం, సికింద్రాబాద్ ఉజ్జయినీ ఆలయం, జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయాల్లో సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి ఆలయం, శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయాల్లో అమ్మవారు కాళరాత్రి అలంకారంలో, భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఐశ్వర్యలక్ష్మి అలంకరణలో లక్ష్మీతాయారమ్మ దర్శనమిచ్చింది. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో కుంకుమార్చనలు, లలితాసహస్ర పారాయణాలు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆయా ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా, సాక్షాత్తు అమ్మవారి జన్మనక్షత్రం అయిన మూలానక్షత్రం సందర్భంగా పలు చోట్ల భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరిపించారు.