ఖమ్మం వ్యవసాయం, జూన్ 29 : రైతుబంధు పథకం ద్వారా అందిస్తున్న పెట్టుబడి సాయం సొమ్ము రెండ్రోజుల్లోనే రూ.97.36 కోట్లను సంబంధిత రైతుల అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దీంతో ఒక్కసారిగా జిల్లావ్యాప్తంగా వానకాలం సాగు పనులు జోరందుకున్నాయి. వరుణుడు కూడా సహకరిస్తుండడంతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అన్నదాతల ఖాతాల్లో సర్కార్ పెట్టుబడి సొమ్ము ఎంత వేగవంతంగా జమ చేయబడుతున్నాయో అదేస్థాయిలో సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ఈ సీజన్కు సంబంధించి సుమారు 3.23 లక్షల మంది రైతులకు రూ.362 కోట్లను పంట పెట్టుబడిగా రాష్ట్ర సర్కార్ ఉచితంగా అందించనున్నది. ఈ మొత్తాన్ని కొద్దిరోజుల వ్యవధిలోనే అన్నదాతలకు అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నది.
అందుకు అనుగుణంగానే సన్న, చిన్న కారు రైతులకు ప్రాధాన్య క్రమంలో ఎకరానికి రూ.5 వేల చొప్పున సొమ్ము జమ చేస్తున్నారు. సాగుకు పెట్టుబడి అవసరంకావడంతో ఆయా గ్రామాల రైతులు సెల్కు సమాచారం వచ్చిన వెంటనే బ్యాంకుల దగ్గరికి వెళ్లి రైతుబంధు డబ్బులను విత్డ్రా చేసుకుంటున్నారు. వాటితో విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసేందుకు షాపుల వద్ద క్యూ కడుతున్నారు. రెండ్రోజులుగా మండల, జిల్లా కేంద్రాల్లో రైతుల రద్దీ కనిపిస్తున్నది. ఇప్పటికే కొందరు రైతులు విత్తనాలు కొనుగోలు చేయగా, మిగిలిన రైతులు కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. రుతుపవనాలు సకాలంలో రావడంతో అవరమైన మేర విత్తనాలు, ఎరువులు అందుబాటులో లభిస్తుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
1.44 లక్షల ఎకరాల్లో సాగు పూర్తి
గతంలో ఎన్నడూ లేనివిధంగా వానకాలం సాగు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవడం, పంటల పెట్టుబడి సకాలంలో అందడంతో సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైతుబంధు సకాలంలో అందడంతో ఆ ప్రభావం సాగు పనులపై స్పష్టంగా కనపడుతున్నది. మూడ్రోజుల నుంచి గ్రామాల్లో ఎక్కడ చూసినా రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై కనిపిస్తున్నారు. జిల్లా వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం సాగు విస్తీర్ణం పరిశీలిస్తే జిల్లావ్యాప్తంగా 1,44,081 ఎకరాల్లో విత్తనాలు విత్తుకున్నారు. 21,135 ఎకరాల్లో వరినార్లు పోసుకోగా, 4,677 ఎకరాల్లో నాట్ల ప్రక్రియ పూర్తయింది. కంది పంటకు సంబంధించి కేవలం కంది సాగు 34 ఎకరాల్లో విత్తుకోగా, అంతర్పంటగా మరో 271ఎకరాల్లో విత్తుకోవడం జరిగింది. పెసర 1,230 ఎకరాల్లో సాగు చేయగా, మినుము 7 ఎకరాలు, మక్క 214 ఎకరాలు, దయించా 41,820 ఎకరాల్లో సాగు చేశారు. వేరుశనగ 6 ఎకరాలు, చెరకు మరో 5,170 ఎకరాలు కాగా పత్తి రికార్డు స్థాయిలో 92,822 ఎకరాల్లో సాగు చేశారు. మొత్తంగా నేటివరకు 1.44లక్షల ఎకరాల్లో విత్తన ప్రక్రియ పూర్తి అయ్యినట్లు అధికారులు చెబుతున్నారు.
భద్రాద్రిలో రూ.36.22 కోట్లు జమ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 63,819 మంది రైతులకు రెండో రోజు బుధవారం వారి వారి ఖాతాల్లో నగదును జమ చేసింది. రూ.36.22 కోట్ల సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభానికి ముందుగానే సాయం అందడంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. వ్యవసాయశాఖ వానకాలం పంటల సాగు కోసం ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలోని 23మండలాల పరిధిలో రైతులకు రైతువేదికల ద్వారా విత్తనాలు, ఎరువులను అందించనుంది. ఇప్పటికే ఆయా మండలాల పరిధిలో సొసైటీలకు ఎరువుల నిల్వలు చేరాయి. ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం 10 వేల ఎకరాలు అదనంగా పెరగడంతో విత్తనాలను కూడా అందుబాటులో ఉంచారు. నకిలీల బెడద లేకుండా ముందస్తుగా విత్తన షాపులను తనిఖీ చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందేలా చర్యలు తీసుకున్నారు. మంగళవారం నుంచి జిల్లాలో ఉన్న రైతులందరికీ రైతుబంధు సాయం అందనుంది. ఇప్పటికే రైతుల ఖాతాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరించి వారికి అందాల్సిన సాయాన్ని ట్రెజరీకి పంపించారు.