భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 27 (నమస్తే తెలంగాణ): మన సొంతిల్లు ఎంత నాణ్యతతో నిర్మించుకుంటామో విద్యాలయాల మరమ్మతు పనులు కూడా అదే నాణ్యతతో చేయించాలని కలెక్టర్ అనుదీప్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. దళితబంధు, మన ఊరు – మన బడి, హరితహారం కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జిల్లాలో ఎంపిక చేసిన 368 పాఠశాలలకుగాను 44 పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు టెండర్ నిర్వహించాల్సి ఉన్నట్లు చెప్పారు. ఈజీఎస్ కింద చేపట్టనున్న 504 పనులకు రూ.29.23 కోట్ల కోసం అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. సమావేశానికి గైర్హాజరైన గిరిజన సంక్షేమశాఖ ఈఈకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు ముత్యం, సోమశేఖరశర్మ, మధుసూదన్రాజు, మరియన్న, రాంప్రసాద్, సీతారాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఫర్నిచర్ పంపిణీ
కొత్తగూడెం ఎడ్యుకేషన్, జూన్ 27: జిల్లా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ద్వారా దాతలు అందించిన ఫర్నిచర్, వాటర్ కూలర్, బుక్స్ తదితరాలను స్థానిక జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో కలెక్టర్ పరిశీలించి పంపిణీ చేశారు.