కల్లూరు: యువత మత్తు పదార్ధాలకు బానిసలు కావద్దని, వాటికి దూరంగా ఉండాలని సత్తుపల్లి జుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ యువరాజు అన్నారు. శనివారం చండ్రుపట్ల రోడ్లోని ప్రతిభ విద్యాలయంలో ఆ సంస్థ అధినేత లక్కినేని ప్రసాద్ ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా సత్తుపల్లి జుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ యువరాజు హాజరై విద్యార్ధులకు చట్టాల పట్ల అవగాహన కల్పించారు.
విద్యార్థులు మంచి నడవడి అలవర్చుకోవాలని, చెడు వైపు కాకుండా మంచి వైపు పయనించాలన్నారు. పిల్లలకు మున్ముందు మంచి భవిష్యత్ ఉంటుందని, ఉన్నత విద్యను అభ్యసించి అన్నిరంగాల్లో విజయం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రఫీ, పోలీసు సిబ్బంది, విద్యాసంస్థల అధ్యాపకులు పాల్గొన్నారు.