కారేపల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల కోసం పరీక్ష రాసిన ప్రతీ స్థానిక విద్యార్థికి సీటు లభించింది. పాఠశాలలో మొత్తం 100సీట్లకు గాను 93మంది స్థానిక విద్యార్థులు ప్రవేశపరీక్ష రాశారు. దీంతో అందరికీ అవకాశం లభించింది. పాఠశాల ప్రారంభం నుంచి ఈ ఏడాది రికార్డు స్థాయిలో స్థానికులకు ప్రవేశాలు లభించాయని పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.డీ.అక్తర్ తెలిపారు.
ఆరోతరగతిలో చేరిన విద్యార్థులకు మంగళవారం ప్రిన్సిపాల్ చేతుల మీదుగా ప్రవేశపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలకు మోడల్ పాఠశాలలో సీటు రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగలక్ష్మి, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.