కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన అందరివాడు అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు కొనియాడారు. మంత్రి పదవిని గడ్డిపోచగా వదిలేసిన గొప్ప వ్యక్తి అని, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు ఆశ్రయం కల్పించిన మహనీయుడు అని ప్రశంసించారు. నాడు అప్పటి ప్రభుత్వం పెద్దాయన అనే గౌరవం లేకుండా బాపూజీ ఇంటి సామగ్రిని అర్ధరాత్రి రోడ్డుపై కుసంస్కారంతో పడేస్తే, ఇప్పుడు అదే జలదృశ్యంలో ఆయన 20 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని సంతోషంగా ఆవిష్కరించడాన్ని తలుచుకుంటే నిజంగా కళ్లల్లో నీళ్లు తిరిగాయని తెలిపారు. మంగళవారం కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి సందర్భంగా సిరిసిల్లలోని రేణుకా ఎల్లమ్మ జంక్షన్లో ఏర్పాటు చేసిన నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద కోటితో ఆధునికీకరించిన ఖబ్రస్థాన్, 18 లక్షలతో కొనుగోలు చేసిన ఆఖరీ సఫర్ వాహనాన్ని ప్రారంభించారు. 2 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఆధునీకరణ, 2.29 కోట్లతో చేపట్టనున్న వెంకంపేట మెయిన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల అర్బన్ మండలం రాజీవ్నగర్లో 13 లక్షలతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ భవనాన్ని ప్రారంభించారు.
సిరిసిల్లరూరల్ /సిరిసిల్లటౌన్/ కలెక్టరేట్/ తెలంగాణచౌక్, సెప్టెంబరు 27 : స్వాతంత్య్ర పోరాటం, నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, తొలిదశ, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కొనియాడారు. బాపూజీ ఒక వర్గానికే కాదని, అన్ని వర్గాలకు, అన్ని రకాల పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచారని, ఉద్యమంలో తాను పాల్గొనడమే కాకుండా సహాయ పడేవారని, ఆయన అందరివాడని గుర్తు చేశారు. మంగళవారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సిరిసిల్లలోని రేణుకా ఎల్లమ్మ జంక్షన్లో ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. 97 ఏండ్ల పాటు జీవించిన లక్ష్మణ్ బాపూజీ ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి ఎన్నికల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి వరుసగా ఏడు సార్లు శాసనసభ్యుడిగా కొనసాగుతూ మంత్రిగా అయ్యారని గుర్తు చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవిని గడ్డిపోచలా త్యాగం చేసిన మహనీయుడు అని కొనియాడారు.
ఐలమ్మ భర్తను విడిపించిండు..
“బాపూజీ గురించి మరొక ఆశ్చర్యకర విష యం దారిలో వచ్చేటప్పుడు తెలుసుకున్నా. విస్నూరి రాంచందర్రావు దొరకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ భర్త పోరాటం చేస్తే అప్పుడు అతన్ని జైలులో పెట్టించారు. ఐలమ్మ భర్త కోసం బాపూజీ న్యాయవాదిగా కోర్టుకు వెళ్లి కొట్లాడి జైలు నుంచి విడిపించాడు” అని మంత్రి కేటీఆర్ నాటి సంఘటనను గుర్తు చేశారు. స్వాతంత్య్రం కోసం పోరాడారని, తర్వాత తెలంగాణ కోసం ఉద్యమించిన గొప్ప వ్యక్తి అని స్పష్టం చేశారు. నాటి ప్రభుత్వాలు కర్కషంగా ఉద్యమా న్ని అణిచివేసిన తర్వాత 2001లో కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం పునః ప్రారంభమైనప్పుడు ఆయనకు ఆశ్రయమిచ్చి ఆశీర్వదించిన మహనీయుడు బాపూజీ అని పేర్కొన్నారు. ఏ జలదృశ్యంలోనైతే కోర్టు తీర్పు పేరుతో అప్పటి ప్రభుత్వం పెద్దాయన అనే గౌరవం లేకుండా బాపూజీ ఇంటి సామగ్రిని అర్ధరాత్రి రోడ్డుపై పడేస్తే, తెలంగాణ వచ్చినంక అదే జలదృశ్యంలో ఆయన 20 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించడం తలుచుకుంటే నిజంగా కళ్లల్లో నీళ్లు తిరిగాయని చెప్పా రు. ఈ విగ్రహావిష్కరణ కూడా పార్టీ తరఫున కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే సాధికారికంగా అన్ని ఏర్పాట్లు చేసి బ్రహ్మాండంగా చేసుకున్నామని, సిరిసిల్లలోనూ ప్రభుత్వం మున్సిపల్ కౌన్సిల్ తరఫుననే విగ్రహావిష్కరణ చేశామన్నారు.
బాపూజీ విగ్రహం ఏర్పాటు గర్వకారణం
అంబేద్కర్, మహాత్మాగాంధీని మనం స్మరించుకుంటున్నామని, సిరిసిల్ల పట్టణంలో కొండా లక్ష్మణ్బాపూజీ విగ్రహం పెట్టుకోవడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బాపూజీ జన్మతహా పద్మశాలి అయినా అన్ని కులాలు, మతాలకు ఉద్యమంలో సేవలందించారని తెలిపారు. లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటుకు మొదటి నుంచి తాము సానుకూలంగానే ఉన్నామని, ఈ విషయమై మున్సిపల్ చైర్పర్సన్, పార్టీ నేతలతో చర్చించామని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్తో ఆలోచనలో పడ్డామని గుర్తు చేశారు. దీనిపై కొందరు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అందరి ప్రభుత్వమని, కొందరిది కాదని, సంస్కారం ఉన్న ప్రభుత్వమని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలకు మహనీయుల పేర్లు పెట్టుకున్నామని, దీని కోసం ఎవరూ అడగలేదని గుర్తు చేశారు. ఒక హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు, వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ నర్సింహారావు పేరు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య జయశంకర్సార్ పేరు, హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు పేరు, కొత్త జిల్లాలైన ఆసిఫాబాద్కు కొమురం భీమ్ పేరు, భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ పేర్లు పెట్టామని స్పష్టం చేశారు. సిరిసిల్లలో మనకు కావాల్సిన విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు స్థలాలు ఉన్నాయని, కొత్త చెరువు ట్యాంక్బండ్పై అన్ని విగ్రహాలు ఏర్పాటు చేసుకుని జయంతులు, వర్ధంతులు నిర్వహించుకునే అవకాశముందన్నారు. కాకా వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. అందరు మహనీయుల జయంతి, వర్ధంతులు ప్రభుత్వమే నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు. బద్దం ఎల్లారెడ్డి, చెన్నమనేని రాజేశ్వర్రావు, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్నతోపాటు తెలంగాణ వీరులు, పోరాటాలు చేసిన ఉద్యమ వీరుల అందరి విగ్రహాలను రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ ఖర్చులతోనే ఏర్పాటు చేస్తామన్నారు.
కూలీలు ప్రారిశ్రామిక వేత్తలుగా మారబోతున్నారు
వరంగల్లో కొడకండ్ల, జనగామ, తదితర ప్రాంతాల నేత కార్మికులు నాలుగైదు దశాబ్దాల కింద సూరత్కు వలస వెళ్లారరని తెలిపారు. సీఎం కేసీఆర్ వారందరినీ పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి వరంగల్లో మెగా కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి, వారికి స్థలాలు కేటాయించి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దారన్నారు. నిజంగా కార్మికులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడం గర్వంగా అనిపించిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తృప్తినిచ్చే పనులు చేస్తేనే గుండె నిండా ఆనందంతో నిండుతుందన్నారు. వరంగల్లో భారతదేశంలోనే అతిపెద్దదైన 1250 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అద్భుతంగా నిర్మాణం జరుగుతుందన్నారు. ఇటీవలే మొదటి యూనిట్ను స్వయంగా ప్రారంభించానన్నారు. ఇంకో రెండు పెద్ద యూనిట్లు ఒక కొరియా సంస్థ, ఇంకొకటి కేరళకు సంబంధించిన కిటెక్స్ సంస్థలకు 300 ఎకరాలకు కేటాయించామని, వాటి పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. మొత్తంగా ఆ పార్కులో 25 వేల నుంచి 30 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందబోతారని అన్నారు. ముఖ్యంగా సూరత్కు వలస కూలీలుగా పోయిన వారు 148 మంది పారిశ్రామికవేత్తలుగా మారబోతున్నారని అన్నారు. అందులో మొదటగా 1100 మందికి అవకాశం కల్పించబోతున్నామని, ముందుగా అత్యంత పేదరికంలో ఉన్న కార్మికులకు అవకాశం కల్పిద్దామని సూచించారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తుందన్నారు. సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించామని, ములుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించుకున్నామన్నారు. దేశంలో ఒక రాష్ట్రంలో అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు.
చేనేతపై జీఎస్టీ విధించిన తొలి ప్రధాని మోదీ
చేనేతపై 5 శాతం జీఎస్టీ విధించిన మొదటి ప్రధాని మోదీ అని, ఈ నిర్ణయం సిగ్గు చేటని మంత్రి విమర్శించారు. గుజరాత్ నుంచి మహాత్మాగాంధీ చరఖా తిప్పి స్వదేశీ వస్తువులను వాడాలని, విదేశీ వస్తువులను బహిష్కరించాలని ఉద్యమాలు చేశారని, అదే చరఖా ద్వారా వచ్చే నూలు, చేనేతపై పన్ను వేయడం దురదృష్టకరమన్నారు. జీఎస్టీ చేనేతకు మరణశాసనమని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా సిరిసిల్లకు పవర్క్లస్టర్ను కేటాయించలేదని, హ్యాండ్లూం టెక్స్టైల్ అడిగినా ఇవ్వలేదన్నారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో స్థానిక ఎంపీ ఏం చేశాడో చెప్పాలని సవాల్ విసిరారు. కులం మతం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని పక్కనబెట్టి మతాల వారీగా ప్రజలను విడదీసే కుట్ర చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జిల్లా పద్మశాలి సంఘం అద్యక్షుడు గాజుల బాలయ్య, పట్టణాధ్యక్షుడు గోలి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.