పర్ణశాల, ఆగస్టు 1: భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం అంజుబాక వద్ద శనివారం దుమ్ముగూడెం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 4.21 క్వింటాళ్ల గంజాయి పట్టుబడింది. ఘటనలో హైదరాబాద్కు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. దుమ్ముగూడెం పోలీసులు శనివారం సాయంత్రం సీఆర్పీఎఫ్, పోలీస్ సిబ్బందితో కలిసి అంజుబాక క్రాస్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో అటుగా వచ్చిన కారును పోలీసులు ఆపి తనిఖీ చేస్తున్నారు. ఇదే సమయంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు పరారయ్యేందుకు యత్నించారు. పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. కారులో 4.21 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని సీలేరు నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తుండగా నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిని హైదరాబాద్లోని చంద్రాయణగుట్టకు చెందిన ఎండీ అష్పాక్, మహ్మద్ ఇమ్రాన్, సయ్యద్ నావిద్, మహ్మద్ అవాయిజ్ గుర్తించామన్నారు. వీరిని భద్రాచలం కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.84.30 లక్షలు ఉంటుందని సీఐ వెల్లడించారు.