మామిళ్లగూడెం, జూలై 30: అక్రమ లేఅవుట్ల ఆడిట్ పకడ్బందీగా జరగాలని, నిబంధనలు ఉల్లంఘించిన వెంచర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి లే అవుట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. లేఅవుట్ల విషయంలో నూతన మున్సిపల్ చట్టాన్ని అమలు చేయాలన్నారు. నూతన మార్గదర్శకాల ప్రకారం సంబంధితశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లేఅవుట్లు, వెంచర్లపై నివేదికలు రూపొందించాలన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటి పారుదలశాఖ, ఆర్అండ్బీ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలన్నారు. విద్యుత్శాఖ అధికారులు లేఅవుట్లలో క్రమపద్ధతిన విద్యుత్తు సౌకర్యం కల్పించాలని సూచించారు. నీటి వనరులకు ఇబ్బంది లేకుండా లేఅవుట్లు ఉండాలన్నారు. అన్అథరైజ్డ్ లేఅవుట్ల నియంత్రణలో రిజిస్ట్రేషన్ శాఖ పాత్ర పోషించాలన్నారు. అనుమతులు పొందిన తర్వాతే రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్జయంతి, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్, శిక్షణ కలెక్టర్ రాహుల్, సర్వే లాండ్స్ ఏడీ రాము, ఆర్ఎండ్బీ ఎస్ఈ లక్ష్మణ్, పీఆర్ ఈఈ చంద్రమౌళి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి సత్యనారాయణ, మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపల్ కమిషనర్లు రమాదేవి, సుజాత, వెంకటేశ్వర్లు, డీపీవో ప్రభాకర్రావు, రిజిస్ట్రార్ అశోక్, ఎన్పీడీసీఎల్ డీఈ రామారావు తదితరులు పాల్గొన్నారు.