వైరా మున్సిపాలిటీ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. మేజర్ పంచాయతీగా ఉన్న పట్టణం మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. గతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వైరా పట్టణం.. ప్రస్తుతం ప్రగతి పథంలో పయనిస్తున్నది. మున్సిపాలిటీకి నిధులు మంజూరు కావడంతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి.
వైరా మున్సిపాలిటీకి మహర్దశ పట్టింది. 2018 సంవత్సరానికి ముందు మేజర్ గ్రామపంచాయతీగా ఉంది. అభివృద్ధికి పూర్తిస్థాయిలో నోచుకోలేదు. 2018లో వైరా మున్సిపాలిటీగా అవతరించింది. వైరాతోపాటు 5 గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. దీన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో వైరా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా అభివృద్ధి పనులను పూర్తి చేయనున్నారు.
వైరా మున్సిపాలిటీలో సుమారు 300 అంతర్గత రోడ్లను సీసీరోడ్లుగా చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణతో కాంట్రాక్టర్ రహదారులను నాణ్యతా ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఈ పనులు చివరిదశకు చేరుకున్నాయి. సోమవరంలో 15, గండగలపాడు గ్రామంలో 20, దిద్దుపూడి గ్రామంలో 25, పల్లిపాడు గ్రామంలో 19, లాలాపురం గ్రామంలో 19 సీసీరోడ్లను నిర్మించారు. వైరా పట్టణంలో 116 సీసీరోడ్లు పూర్తిచేశారు. వైరా పట్టణంలో మరో 100 సీసీరోడ్ల నిర్మాణానికి ముమ్మరంగా పనులు చేపడుతున్నారు. ఇప్పటికే పట్టణంలో 100 రోడ్లపై వెట్మిక్స్ను పోశారు. మరో 86 రోడ్లను ప్రారంభించాల్సి ఉంది. రోడ్లను 6 అంగుళాల మందంతో నిర్మిస్తున్నారు. అంతేకాకుండా రోడ్లకు ఇరువైపులా సైడ్బరమ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ల నిర్మాణం రెండు నెలల్లో పూర్తికానుంది. నిర్మాణం పూర్తయితే ప్రజల ఇబ్బందులు తీరనున్నాయి.
వైరా పట్టణంలో సీసీరోడ్ల నిర్మాణంతోపాటు బస్టాండ్ ఎదురుగా మధిర ప్రధాన రహదారికి ఒకవైపు డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించారు. సింగిల్ఆర్మ్ లైటింగ్కు నిధులు మంజూరయ్యాయి. బస్టాండ్ ఎదురుగా ఉన్న మధిర రోడ్డుకు ఒకవైపు 650 మీటర్ల దూరం అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించనున్నారు. డ్రైనేజీ నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో ఇబ్బందులు తప్పనున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారులపై 144 లైటింగ్ పోల్స్ను ఏర్పాటు చేయనున్నారు. వీటికి సింగిల్ ఆర్మ్లైటింగ్ను ఏర్పాటు చేయనున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు వైరా మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో ఇక్కడ అభివృద్ధి గురించి కనీసం పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, అజయ్కుమార్, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ కృషితో వైరా పట్టణం మరింత అభివృద్ధి చెందుతున్నది. గతంలో బురదమయంగా ఉన్న రోడ్లపై వర్షాకాలంలో వెళ్లాలంటే ప్రజలు అవస్థలు పడేవారు. ప్రస్తుతం ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులతో వైరాతోపాటు మున్సిపాలిటీలోని గ్రామాల్లో సీసీరోడ్లు నిర్మిసున్నది. సోమవరం, గండగలపాడు, దిద్దుపూడి, పల్లిపాడు, లాలాపురం గ్రామాల్లో రహదారులు అద్దంలా మెరుస్తున్నాయి.
వైరా మున్సిపాలిటీని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే ప్రభుత్వం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు రూ.20 కోట్లను మంజూరు చేసింది. ఆ నిధులతో పట్టణంతోపాటు మున్సిపాలిటిలోని గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మిస్తున్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద వైరా మున్సిపాలిటీకి మరో రూ.2 కోట్లను మంజూరు చేసింది. సీఎం కేసీఆర్, మంత్రుల సహకారంతో వైరాను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నా.
–లావుడ్యా రాములునాయక్, వైరా ఎమ్మెల్యే
వైరా మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. సీసీరోడ్ల నిర్మాణంతో రూపురేఖలు మారిపోయాయి. గతంలో మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు అస్తవ్యస్తంగా ఉండేవి. రూ.20 కోట్లతో సీసీరోడ్లను నిర్మించడంతో అద్దంలా మెరుస్తున్నాయి. పట్టణంతో పాటు విలీన గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలగిపోయాయి
-సూతకాని జైపాల్, వైరా మున్సిపాలిటీ చైర్మన్