నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు
సారంగాపూర్ మండలంలో కేంద్రాల పరిశీలన
సారంగాపూర్, మే 30 : వారం రోజుల్లోగా కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైస్మిల్లర్లకు తరలిస్తామని నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. సారంగాపూర్ మండలంలోని ధని, జామ్, సారంగాపూర్ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో ఇప్పటికే కొనుగోళ్లు పూర్తికావస్తున్నాయని, సారంగాపూర్ మండలంలో మాత్రమే ధాన్యం నిల్వ ఉన్నదన్నారు. త్వరలోనే కొనుగోళ్లు పూర్తిచేస్తామని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల ఏర్పడిన తుఫాను మూలంగా గన్నీ సంచుల కొరత ఏర్పడిందని తెలిపారు. లారీల కొరతతో ధాన్యాన్ని రైస్మిల్లర్లకు తరలించకపోవడంతో వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని జామ్ సర్పంచ్ మహిపాల్ మురళీకృష్ణ అదనపు కలెక్టర్కు విన్నవించారు. సమస్య పరిష్కరించి, వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు చేస్తామని రాంబాబు హామీ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈయన వెంట తహసీల్దార్ తుకారం, ఆర్ఐ ముంతాజ్, రైతులు ఉన్నారు.