కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కాంగ్రెస్, వామపక్షాల ఆందోళన
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో రాస్తారోకో
పలువురు నేతల అరెస్టు
నిర్మానుష్యంగా మారిన రహదారులు
ఖమ్మం, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ రాజకీయ పక్షాలు ఇచ్చిన భారత్బంద్ సోమవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీడీపీ, తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు ఉదయం 5 గంటలకే ఆర్టీసీ డిపోల వద్ద బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు. ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డిపోల నుంచి బస్సులు ఉదయం వేళలో బయటకురాలేదు. బ్యాంకులు పనిచేయలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను పార్టీల నాయకులు కలిసి బంద్ పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వాణిజ్య సంస్థలూ బంద్ పాటించాయి. ఆటో కార్మికులు సైతం బంద్కు మద్దతిచ్చారు. ఖమ్మం కొత్త బస్టాండ్ వద్ద గల బైపాస్ రోడ్డుపై ఆయా రాజకీయ పక్షాల నేతలు రాస్తారోకో చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.