హరితహారానికి ఆదరణ
రూపురేఖలు మార్చిన పల్లెప్రగతి
ప్రభుత్వ నిధులు సద్వినియోగం
కూసుమంచి రూరల్, సెప్టెంబర్ 26 : మండలంలోని పెద్ద పంచాయతీల్లో ఒకటైన పోచారంలో పచ్చదనం వెల్లివిరుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్లుగా అమలు చేస్తున్న హరితహారం ఫలితానికి ఆ గ్రామం నిదర్శనంగా నిలుస్తున్నది. దీనికితోడు పల్లెప్రగతిలో భాగంగా గ్రామ పంచాయతీలకు నేరుగా అందించే నిధులతో మౌలిక సమస్యలు పరిష్కామయ్యాయి. హరితహారం కింద ఇప్పటివరకు 5వేల మొక్కలు పంపిణీ చేశారు. అవెన్యూ ప్లాంటేషన్ కింద 3,200 మొక్కలు పంచాయతీ తరఫున నాటారు. పల్లె ప్రకృతి వనంలో మరో 1,600 మొక్కలు నాటి పెంచుతున్నారు. వాటిలో అరుదైన ఔషధ, పండ్ల మొక్కలు ఉన్నట్లు వన సేవకుడు సల్వాది ముత్తయ్య చెప్పాడు. వైకుంఠధామం, పల్లెప్రకృతి వనంతో పాటు, ఇండ్ల ఆవరణం, వీధులకు ఇరువైపులా నాటిన మొక్కల్లో అధికశాతం బతికాయి. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటడంలో పంచాయతీ పాలకవర్గం, సిబ్బంది చొరవ చూపుతున్నారు. పంచాయతీ పరిధిలోని పెద్దపోచారం, చిన్న పోచారం, సీతారాంపురం గ్రామాల్లో కూడా రెండేళ్లలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. ఈజీఎస్ పథకంలో రూ.16 లక్షలతో మూడు సీసీ రోడ్లు, రూ.4 లక్షలతో రెండు సైడ్ డ్రైన్లు నిర్మించారు. అలాగే రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.3 లక్షలతో డంపింగ్యార్డు, రూ.22 లక్షలతో రైతువేదిక నిర్మాణాలు జరిగాయి. గ్రామ శివారులో చెత్త సేకరణ షెడ్, హరితహారం నర్సరీ ఏర్పాటు చేశారు. పంచాయతీకి ప్రతినెలా అందుతున్న రూ.2 లక్షల గ్రాంట్తో వీధిలైట్లు, సిబ్బంది జీతాలు, కార్యాలయం అద్దె, ట్రాక్టర్ నిర్వహణ ఖర్చులు పోగా మిగిలిన నిధులను అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నం..
మా పంచాయతీకి మంజూరైన ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నం. రైతువేదిక, వైకుంఠధామం, డంపింగ్యార్డు నిర్మాణాలతోపాటు పల్లె ప్రకృతివనం, నర్సరీని ఏర్పాటు చేశాం. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాలను ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేస్తున్నాం. పల్లె ప్రగతి కింద మంజూరైన నిధులతో వీధుల్లోని కంపచెట్ల తొలగించి, మట్టి పోయించాం. పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
పట్టణాలకు దీటుగా పంచాయతీలు
ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టాక పట్టణాలకు దీటుగా పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్రక్కు, వాటర్ ట్యాంకు సమకూర్చడంతోపాటు నలుగురు మల్టీపర్పస్ వర్కర్లను నియమించడం ఏ రాష్ట్రంలోనూ లేదు. పారిశుధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అభివృద్ధితో పాటు ప్రతి కుటుంబానికి రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ వంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రజల సహకారంతో గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తాం.