ఖమ్మం నగరంలో పంపిణీ చేసిన మంత్రి అజయ్
ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీచైర్మన్
మిగిలిన అర్హులకు రెండో విడతలో కార్డులు మంజూరు చేస్తాం
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం, జూలై 26: ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సోమవారం కొత్త రేషన్కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో తొలిరోజు 14 మండలాల్లో 1,948 మందికి, భద్రాద్రి జిల్లాలో 3,420 మంది లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీచైర్మన్ పండుగ వాతావరణంలో కొత్త కార్డులు పంపిణీ చేశారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వారికి కార్డులు అందడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 12,111 కొత్త రేషన్ కార్డులను అందిస్తున్నామన్నారు. అర్హులందరికీ రేషన్కార్డులు అందజేస్తామని, రానివారు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. లబ్ధిదారులకు వచ్చేనెల నుంచి రేషన్ అందుతుందని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా నూతన రేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో 12,111 నూతన రేషన్ కార్డులను అందిస్తున్నట్లు చెప్పారు. నగరంలోని డీపీఆర్సీ భవనంలో సోమవారం నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీకి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా ఖమ్మం అర్బన్ మండలంలో అత్యధికంగా 2,076 నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రేషన్ కార్డుల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న అర్హుల్లో మొదటి విడతలో 12,111 మందికి నూతన రేషన్ కార్డులు మంజూరైనట్లు చెప్పారు. ఇంకా వివిధ కారణాల వల్ల పెండింగ్లో ఉన్న దరఖాస్తులు కూడా పరిశీలించి రెండో విడతలో పంపిణీ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. ప్రస్తుతం అందుకుంటున్న నూతన రేషన్ కార్డుల ద్వారా ఆగస్టు నుంచి లబ్ధిదారులు రేషన్ పొందవచ్చన్నారు. గతంలో మాదిరిగా పరిమితి లేకుండా కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి 6 కేజీల చొప్పున రేషన్ అందిస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో 12,111 నూతన రేషన్ కార్డులను ఆమోదించినట్లు చెప్పారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కేఎంసీ మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, అదనపు కలెక్టర్ ఎస్.మధుసూదన్రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, ఆర్డీవో రవీంద్రనాథ్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, కార్పొరేటర్లు పగడాల శ్రీవిద్య, కమర్తపు మురళి, కర్నాటి కృష్ణ, వలరాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.