ప్రారంభించిన మంత్రి అజయ్..
పేదలకు మెరుగైన వైద్యం సీఎం కేసీఆర్ లక్ష్యం
మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం సిటీ, 26 : ప్రతి నిరుపేద కుటుంబానికి నయాపైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం పెద్దాసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ (కరోనా నిర్ధారణ పరీక్ష) సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్పొరేట్ను తలదన్నే రీతిలో మాతా, శిశు సంరక్షణ కేంద్రాలను నెలకొల్పి ఆడబిడ్డ పుడితే రూ. 13 వేలు, మగ బిడ్డకు రూ.12 వేలు నగదును ఆన్లైన్ పద్ధతుల్లో లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తున్నారని పేర్కొన్నారు. అప్పుడే పుట్టిన శిశువుకు కేసీఆర్ కిట్ అందజేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న మహానేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కరోనా నిర్ధారణ నిమిత్తం కీలకమైన ఆర్టీపీసీఆర్ టెస్ట్లు కూడా చేయనున్నారని, ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
ప్రస్తుతం జిల్లాలో కరోనా అదుపులోనే ఉందన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్, వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బీ మాలతి, జిల్లా దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, డాక్టర్ సైదులు, డైటీషియన్ మేరీ, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ ఎండీ ఖమర్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జ్ ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్లో రోజువారీ పనులు చేస్తున్న కూలీలు వారి సమస్యలను మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ గౌతమ్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.