మొండికుంట గ్రామస్తుడి నుంచి రూ.15 వేలు లంచం డిమాండ్
ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన అధికారి
లంచం అడిగితే ఫోన్ చేయండి : ఏసీబీ డీఎస్పీ
అశ్వాపురం, జూలై 26: రెక్కాడితే గానీ డొక్కాడని ఓ నిరుపేద వేడుకోలు ఆ అధికారి మనసును కరిగించలేదు.. బతుకుదెరువు కోసం బడుగు జీవి షెడ్డు నిర్మించుకుంటుంటే ఇదేంటని ప్రశ్నించాడు.. అడిగితే తప్పు లేదు గానీ ఆయన చట్టపరంగా ముందుకు వెళ్లలేదు.. నిర్మాణానికి ఉపయోగించే స్తంభాలను నిర్దయగా అక్కడి నుంచి తీసుకువెళ్లాడు.. అంతేకాదు ఏకంగా రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఇచ్చుకోలేనని ప్రాధేయపడినా వినిపించుకోలేదు.. చివరికి ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆ ‘అవినీతి అధికారి’ ఆట కట్టించారు..
లంచం తీసుకుంటూ ఇరవెండి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పూనెం నాగారజు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమణబాబు తెలిపిన వివరాలప్రకారం.. అశ్వాపురం మండలం మొండికుంటకు చెందిన బానోత్ వీరన్న అనే వ్యక్తి గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన తాత్కాలికంగా సైకిల్ షాపు ఏర్పాటు చేసుకుని బతుకుదామనుకున్నాడు. దీనిలో భాగంగా గత నెల 24న షెడ్డు నిర్మాణానికి రోడ్డు పక్కన నాలుగు సిమెంట్ స్తంభాలు పాతాడు. సమాచారం తెలుసుకున్న ఇరవెండి ఫారెస్టు సెక్షన్ అధికారి పూనెం నాగరాజు గ్రామానికి వెళ్లి స్తంభాలు తీయించాడు. వాటిని మొండికుంట ఫారెస్ట్ నర్సరీకి తరలించాడు. వీరన్న సిమెంట్ స్తంభాలు ఇవ్వాలని ప్రాధేయపడినా అధికారి కనికరించలేదు. రూ.15 వేలు లంచం కావాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బు తాను ఇవ్వలేనని మొరపెట్టుకున్నా వినలేదు. దిక్కు తోచని పరిస్థితిలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వీరన్నను భద్రాచలం పిలుపించుకుని ఫారెస్టు సెక్షన్ అధికారి నాగరాజు రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేయిస్తున్నట్లు తెలిపారు.