వానకాలం సీజన్లో సాధారణాన్ని మించిన వర్షపాతం
సకాలంలో పలకరించిన తొలకరి.. దంచికొట్టిన వానలు
సంబురంగా సాగిన వ్యవసాయం.. అన్నదాత ఆనందం
నేటి నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశం
ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 25:నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ వానకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా వానలు పుష్కలంగా కురిశాయి. సీజన్ ఆరంభం నుంచి పంట చేతికి వచ్చే సమయం వరకూ ఆశించిన మేర వర్షపాతం నమోదైంది. దీంతో వర్షాధార పంటలు సాగు చేసిన రైతులకు మంచి ప్రయోజనం చేకూరింది. మరోవైపు సాగర్ కాలువ ద్వారా నిరంతరం నీరు సరఫరా కావడంతో వానకాలం సాగు మూడు పువ్వులు, ఆరు కాయలు అన్న చందంగా వర్ధల్లింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మిర్చితో కలిపి 5,96,149 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కావచ్చని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. అంచనాల తరువాత మిర్చి పంట ఉద్యాన శాఖలో కలిసింది. వ్యవసాయ శాఖ గణాంకాల్లో మొత్తం 5,89,060 ఎకరాల్లో వివిధ పంటలు సగయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మరో 1.10 లక్షల ఎకరాల్లో మిర్చిని రైతులు సాగుచేశారు. దీంతో ఈ ఏడాది అంచనాకు మంచి మరో లక్ష ఎకరాలు అదనంగా సాగయినట్లయింది. నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్ నుంచి అక్టోబర్)కు జిల్లాలో సాధారణ వర్షపాతానికి మంచి తొలిసారిగా అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో వానకాలం సాధారణ వర్షపాతం 1036 మిల్లీమీటర్లు కాగా ఈసారి 1098 మిల్లీమీటర్లు నమోదు కావడం విశేషం.
వరి, మిర్చి సాగుపై అధిక వర్షాల ప్రభావం
జిల్లాలో వానకాలం సీజన్లో వరి సాగు 2,52,500 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా.. ఈ ఏడాది 2,95,640 ఎకరాల్లో సాగైంది. మిర్చి కూడా ఏటా కేవలం 55 వేల ఎకరాలకే పరిమితమయ్యేది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకూ 1.10 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. వానకాలంలో అధిక వర్షాల ప్రభావం యాసంగి సీజన్పై ఉండే అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు విస్తారంగా వర్షాలు కురవడంతో ప్రస్తుతం రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దీంతో భూగర్భ జలాలు మరింత పైకి రావడంతో ఈ యాసంగిలో మైదాన ప్రాంతాల్లో బోరుబావులు, వ్యవసాయ బావుల ఆధారంగా సాగయ్యే పంటలకు నీటి కొరత ఉండకపోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
నేటి నుంచి ఈశాన్య రుతుపవనాలు..
మంగళవారం నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణశాఖ అధికారులుఇప్పటికే ప్రకటించారు. ఈశాన్యరుతుపవనాల ప్రభా వం తెలంగాణపై అంతగా ఉండే అవకాశంలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.