గంట ముందుగానే కేంద్రానికి ఫస్టియర్ విద్యార్థులు
ఖమ్మం జిల్లాలో 16,909, భద్రాద్రి జిల్లాలో 9583మంది హాజరు
ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 25 : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రథమ సంవత్సరం తెలుగు/ సంస్కృతం సబ్జెక్ట్తో పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం నిబంధన ఉండడంతో విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, సహాయకులు తోడుగా వచ్చారు. ప్రైవేట్ కళాశాలల విద్యార్థులను తమ బస్సుల్లో పరీక్ష కేంద్రాల వద్ద దింపారు. పరీక్షా కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలను అమలు చేశారు. విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించే సమయంలో ధర్మల్ స్క్రీనింగ్ చేసి, శానిటైజర్ వేశారు. భౌతికదూరం పాటించేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. ఐసొలేషన్ గదులను ప్రత్యేకంగా కేటాయించారు.
ఖమ్మం జిల్లావ్యాప్తంగా 76పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు రెగ్యులర్ 18,060 మందికి 16,909మంది హాజరై 1,151మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రవిబాబు తెలిపారు.
పరీక్ష సమయం కంటే ఆలస్యంగా రావడంతో ఇద్దరు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. సత్తుపల్లిలోని ఓ కేంద్రానికి విద్యార్థి 15 నిమిషాలు ఆలస్యంగా కావడంతో నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. ఖమ్మం నగరంలోని నయాబజార్ కళాశాలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని నిబంధనల మేరకు అనుమతించలేదని డీఐఈఓ తెలిపారు. నగరంలో ఒక విద్యార్థికి ధర్మల్ స్క్రీనింగ్లో టెంపరేచర్ ఉండటంతో ఐసొలేషన్ గదిలో పరీక్ష రాయించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 34 కళాశాలల్లో పరీక్షల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు పరీక్ష జరిగింది. మొత్తం 10,820 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 9,583మంది హాజరు కాగా 1,237మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పటిష్టంగా అమలు చేశారు. జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సులోచనారాణి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
సీసీ టీవీలు ఏర్పాటు చేయాలి : కలెక్టర్
పరీక్షా కేంద్రాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కొత్తగూడెం పట్టణంలోని మహిళా కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఇబ్బందులుంటే సంబంధిత అధికారి దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.