కొత్తగూడెం క్రైం/ మామిళ్లగూడెం, అక్టోబర్ 25: దేశం కోసం, దేశ భద్రత కోసం ఏటా ఎంతోమంది సైనికులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని, అలాంటి అమరవీరుల ఆశయాల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్దత్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కొత్తగూడెం డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వరబాబు అధ్యక్షతన సోమవారం కొత్తగూడెం సింగరేణి మైదానం నుంచి లక్ష్మీదేవిపల్లి సెంట్రల్ పార్క్ వరకు నిర్వహించిన భారీ సైకిల్ ర్యాలీలో ఎస్పీ సునీల్ దత్ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా శత్రువుల దాడిలో ప్రాణాలు విడుస్తున్న ఎంతోమంది పోలీసు త్యాగధనుల వల్లే ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతున్నారని అన్నారు. బాధ్యతగా వ్యవహరించే ప్రతి పౌరుడూ దేశభక్తుడేనన్నారు. సైకిల్ ర్యాలీని ఎస్పీ సునీల్దత్ జెండాని ఊపి ప్రారంభించారు.