ఖమ్మం, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగిన టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలు, పార్టీ ప్లీనరీలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి అజయ్కుమార్ నేతృత్వంలో పార్టీ క్యాడర్ సోమవారం ఉదయానికే సభాస్థలి అయిన హైటెక్స్కు చేరుకుంది. ప్లీనరీలో జరిగిన రాజకీయ చర్చలు, తీర్మానాలు, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన ప్రసంగం జిల్లా నేతలకు, శ్రేణులకు నూతనోత్తేజాన్ని కలిగించింది. జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాలు, కేసీఆర్ ఖమ్మం దీక్ష, అరెస్టు వంటి చారిత్రక ఘట్టాలు సమావేశంలో ప్రస్తావనకు రావడంతో జిల్లా నేతలు ఉప్పొంగిపోయారు. ఇదే స్ఫూర్తితో నవంబర్ 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభకు శ్రేణులను తరలించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడంతో జోష్ నెలకొంది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పలు అంశాలపై ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్లీనరీ పూర్తయిన వెంటనే వరంగల్ విజయగర్జన సభకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 27న వీటికి శ్రీకారం చుట్టనున్నారు. మధిరలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, రాములునాయక్, హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, చంద్రావతి, మదన్లాల్, తాటి వెంకటేశ్వర్లు, భద్రాది జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు ఖమర్, దిండిగాల రాజేందర్, టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, కేఎంసీ మేయర్ నీరజ, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ డీవీ, సుడా చైర్మన్ విజయ్కుమార్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు బొమ్మెర రామ్మూర్తి, మట్టా దయానంద్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.