వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి
జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు
జడ్పీ స్థాయీ సంఘాల సమావేశం
మామిళ్లగూడెం, సెప్టెంబర్ 25: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో నూరు శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ చైర్మన్ లింగాల కమల్రాజు సూచించారు. ఖమ్మంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జరిగిన జడ్పీ స్థాయీ సంఘాల సమావేశంలో ఆయన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షించి మాట్లాడారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి జరిగే స్థాయీ సంఘాల సమావేశాలకు ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులు ప్రధానంగా ప్రగతి నివేదికలతో రాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలతో జిల్లాలో విద్యాసంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఈవో, డీఐఈవోలను ఆదేశించారు. పాఠశాల్లో ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న చోట అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు, కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. కొవిడ్ వ్యాప్తి కొంత మేరకు తగ్గుముఖం పట్టినప్పటికీ వైద్యాధికారులు నిత్యం ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో అపోహలు తొలగిపోయేలా అవగాహన పెంచాలని సూచించారు. నూరు శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. పంట ప్రణాళిక ప్రకారం విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. వరి, పత్తి, మిరప పంటలకు వచ్చే తెగుళ్ల నివారణకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. పల్లెప్రగతిలో ఇంకా పూర్తి కాని పనులను గుర్తించి వెంటనే పూర్తి చేయించాలన్నారు.
అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు వెంటనే కార్యాచరణ పూర్తి చేసి రుణాలు మంజూరు చేయాలన్నారు. 2వ స్థాయీ సంఘంలో గ్రామీణాభివృద్ధి, 6వ స్థాయీ సంఘం సాంఘిక సంక్షేమం, 1, 7 స్థాయీ సంఘాల్లో ఆర్థిక, ప్రణాళిక పనులు, 4వ స్థాయీ సంఘంలో విద్య, వైద్యం, 3వ స్థాయీ సంఘంలో వ్యవసాయం, 5వ స్థాయీ సంఘంలో మహిళా సంక్షేమంపై సమీక్షించారు. జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, శిక్షణ కలెక్టర్ రాహుల్, డిప్యూటీ సీఈవో కొండపల్లి శ్రీరామ్, జడ్పీ వైస్ చైర్మన్ ధనలక్ష్మి, జడ్పీటీసీలు అధికారులు పాల్గొన్నారు.