కొత్తగూడెం, సెప్టెంబర్ 25 :ఎటు చూసినా ప్రకృతి అందాలు.. ఆహ్లాదపరిచే వాగులు, వంకలు.. గలగలా పారుతూ గోదావరి.. ఒంపు సొంపుల కిన్నెరసాని.. దక్షిణ అయోద్య పురి భద్రాచలం క్షేత్రం.. సీతమ్మ నార చీరెలు ఆరేసిన ప్రాంతం పర్ణశాల.. పరిశ్రమల పట్టణం పాల్వంచ.. సింగరేణి సిరులకు ఆలవాలం కొత్తగూడెం.. ఇవన్నీ పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలే.. ఇలా భద్రాద్రి జిల్లా పర్యాటక ప్రాంతాలకు కేరాఫ్గా నిలుస్తున్నది. నేడు పర్యాటక దినోత్సవం సందర్భంగా ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
ప్రకృతి అందాల నెలవు భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ. ప్రకృతి రమణీయత మధ్య జిల్లాలో పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. దక్షిణ అయోధ్య పురి అయిన భద్రాద్రి పుణ్యక్షేత్రం దేశానికే తలమానికం. శ్రీసీతారామ లక్ష్మణులు నడయాడిన భూమిగా భద్రాచలానికి పేరున్నది. అలాగే పర్ణశాల రామాలయం అనాది నుంచి ప్రాముఖ్యతను సంతరించుకున్నది. గోదావరి తీరమంతా పచ్చని అందాలను పరుచుకోవడంతో పర్యాటకులను ఆకర్షిస్తున్నది. వాగులు, వంకలు, సెలయేరులు, దట్టమైన అడవులు, ఆదివాసీల జీవనం.. ఇలా అన్నీ పర్యాటకంగా ఆకట్టుకునేవే. నేడు పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక కథనం.
జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు..
పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని రిజర్వాయర్లో ఏర్పాటు చేసిన బోటు షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. అద్దాల మేడల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జింకల పార్క్ పిల్లలకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. భద్రాచలంలో రామాలయానికి నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. గోదావరిలో ప్రయాణం, పాపికొండల అందాలు పర్యాటకులను ప్రకృతి రమణీయతతో కట్టిపడేస్తాయి. కొత్తగూడెంలోని సెంట్రల్ పార్క్, సింగభూపాలెం చెరువు, బూర్గంపాడులోని వేలేరు, పాములేరు వాగులు, సీతారామ ప్రాజెక్టు కాలువలు, భద్రాచలంలోని భద్రాచలం కరకట్ట, పర్ణశాల, గుబ్బలమంగి వాగు, చర్లలోని తాలిపేరు, ఇల్లెందులోని వాటర్ ఫాల్స్, అశ్వారావుపేటలో మూకమామిడి చెరువు, చండ్రుగొండలోని వెంగళరావు ప్రాజెక్టు, గు బ్బలమంగమ్మ తల్లి ఆలయం, మణుగూరులోని సమ్మక్క సారలమ్మ గద్దెలు, వా టర్ ఫాల్స్ పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి. ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కుటుంబాలతో విహార యాత్రలు వెళ్లాలనుకునేవారు ఆయా ప్రాంతాల్లో హాయిగా గడపవచ్చు.
బడ్జెట్ హోటల్తో మరింత శోభ..
తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నది. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో బడ్జెట్ హోటల్ నిర్మితమవుతున్నది. కిన్నెరసానిలో అద్దాల మేడలు సిద్ధమవుతున్నాయి. మరో ఆరునెలల్లో పనులు పూర్తి కానున్నాయి. ఇవి పూర్తయితే జిల్లాకు పర్యాటకులు తాకిడి పెరగనున్నది.