ఆదివారం సాయంత్రం 42 అడుగుల వద్ద ప్రవాహం
ఒకటి, రెండు ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ
ఊపిరి పీల్చుకున్న లోతట్టు ప్రాంత ప్రజలు
భద్రాచలం, జూలై25: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి గంట గంటకు తగ్గుతున్నది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడం, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ఆగిపోవడంతో నదిలో వరద తగ్గుతున్నది. శనివారం సాయంత్రం 48 అడుగులకు నీటిమట్టం చేరడంతో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో గోదావరి తీరంలో ఉన్న కల్యాణకట్ట, విస్టా కాంప్లెక్స్, అన్నదాన సత్రం, రామాలయ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఆదివారం ఉదయం 46.70 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక, సాయంత్రం 4గ ంటలకు 42.20 అడుగులకు వరద తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను కలెక్టర్ ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. వరద ముప్పు తప్పడంతో లోతట్టు ప్రాంతవాసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
దుమ్ముగూడెంలో 18.5 అడుగుల వద్ద..
దుమ్ముగూడెం, జూలై 25: వరుసగా కురుస్తున్న వర్షాలకు శనివారం దుమ్ముగూడెం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహించింది. ఎగువన వానలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం క్రమంగా నీటి మట్టం తగ్గుతూ వచ్చింది. సాయంత్రానికి దుమ్ముగూడెం హెడ్లాకుల వద్ద 18.5 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు.
పారిశుధ్య చర్యలు చేపట్టాలి: కలెక్టర్
కొత్తగూడెం, జూలై 25: వరద ఉధృతి కొనసాగుతున్న ప్రాంతాల పరిధిలోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనదీప్ సూచించారు. ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లాలన్నారు. ప్రజలకు శుద్ధజలం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు.